చిరు, దిగ్విజయ్ చెప్పినా ప్రజలు వినరు: లగడపాటి
పార్టీలు దిగి వచ్చి తెలుగు తల్లి కన్నీళ్లు తుడవాలని ఆయన అన్నారు. పార్టీలు, నాయకులతో సంబంధం లేకుండా సమైక్యాంధ్ర ఉద్యమం సాగుతుందని, ఈ ఇంతటితో ఆగబోదని ఆయన అన్నారు. సీమాంధ్ర సమైక్య నినాదంతో మార్మోగుతోందని అన్నారు. తెలంగాణ నుంచి సీమాంధ్రులను తరిమే దమ్మూ ధైర్యం ఎవరికీ లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యాఖ్యల ప్రతులను పార్లమెంటులో పంచుతామని చెప్పారు.
పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే జరిగే ఒక్క రోజు కూడా సమావేశం జరగదని ఆయన అన్నారు. చాలా మంది పార్లమెంటు సభ్యులు విభజనను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. సమైక్యతను, తెలుగుతల్లి గౌరవాన్ని కాపాడుతామని అన్నారు. సమైక్యాంధ్రను కాపాడుకోవడానికి ఏది చేయడానికై సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. సమైక్యాంధ్రను కాపాడుకోవాలా, వద్దా అనేది ప్రజల చేతుల్లోనే ఉందని అన్నారు.
ప్రజా ఉద్యమానికి తలొగ్గి కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు రాజీనామా చేయాల్సిందేనని అన్నారు. వారంతా సమైక్య ఉద్యమంలోకి రాక తప్పదని లగడపాటి అన్నారు. సమైక్య నినాదంతో సీమాంధ్ర రగిలిపోతోందని అన్నారు. అన్ని పార్టీలూ సమైక్యానికి అనుకూలంగా పార్టీలను, నాయకులను ప్రజలు కట్టడి చేయాలని ఆయన అన్నారు. రేపు ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటామని ఆయన చెప్పారు.
రాష్ట్రం సమైక్యంగా ఉండదని తేలిన రోజు రాజీనామా చేయాలని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కనుమూరి బాపిరాజు అన్నారు. సీమాంధ్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు అసమర్థులు కాబట్టే విభజన ప్రకటన వచ్చిందని ఆయన ఏలూరులో అన్నారు.