ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ కు చెక్
ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ప్లేఆఫ్ చేరే అవకాశాలకు చెక్ పడింది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోవడంతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శనివారం రాత్రి చెన్నై చెపాక్ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది ముంబై ఇండియన్స్. ఈ జట్టు నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని రుతురాజ్ గైక్వాడ్ అజేయ అర్ధసెంచరీతో చెన్నై సునాయసంగా అందుకుంది. ప్రత్యర్థులపై సీజన్ డబుల్ పూర్తిచేసింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. నమన్ ధీర్ 57 హాఫ్ సెంచరీతో రాణించినా.. మిగతా బ్యాటర్లు విఫలం అయ్యారు. మొన్నటి మ్యాచ్ లో సెంచరీతో అదరగొట్టిన ర్యాన్ రికెల్టన్ ఇక్కడ కూడా దూకుడుగా ఆడాడు గానీ ఎక్కువ సేపు క్రీజ్ లో నిల్చోలేకపోయాడు. సూర్యకుమార్ యాదవ్- 21, కేప్టెన్ హార్దిక్ పాండ్యా- 18, తిలక్ వర్మ- 5 మళ్లీ విఫలం అయ్యారు.

అనంతరం సీఎస్కే 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 160 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్- 67, కార్తీక్ శర్మ- 54 అజేయ హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఓపెనర్ సంజు శాంసన్ 11 పరుగులే చేసినా మరో ఓపెనర్ ఉర్విల్ పటేల్ దూకుడుగా ఆడాడు. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. తొమ్మిది మ్యాచ్లలో రెండు విజయాలతో నాలుగు పాయింట్లు మాత్రమే ఈ జట్టు ఖాతాలో ఉన్నాయి.
ప్లేఆఫ్స్ చేరాలంటే.. మిగిలిన అయిదు మ్యాచ్లలోనూ గెలిస్తే గరిష్టంగా 14 పాయింట్లను చేరుకుంటుంది. 14 పాయింట్లతో ప్లేఆఫ్లకు అర్హత సాధించడం సాధ్యమే అయినప్పటికీ, అది ఇతర జట్ల అనుకూల ఫలితాలపైనా పూర్తిగా ఆధారపడి ఉంటుంది. అయిదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ఇప్పుడు తన ప్లేఆఫ్ అవకాశాలను చేజేతులా నాశనం చేసుకుంటోంది. మిగిలిన అయిదింటినీ గెలవడమే కాకుండా, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడే స్థాయికి దిగజారింది.
లీగ్లో ప్రస్తుతం అత్యల్పంగా ఉన్న తమ నెట్ రన్ రేట్ గణనీయంగా మెరుగుపరచుకోవడం కూడా ముంబై ఇండియన్స్ కు అత్యవసరం. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు 12 పాయింట్ల చొప్పున సాధించాయి. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ లో నిలవాలంటే ఈ టాప్ జట్లలో కనీసం రెండు లేదా మూడు జట్లు ఓడిపోవాలి. తద్వారా 14 పాయింట్లు దాటిన జట్లు నాలుగింటికి మించకుండా చూడాలి.
ముంబై ఇండియన్స్ మిగిలిన మ్యాచ్లు.. 4న లక్నో సూపర్ జెయింట్స్, 10న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 14న పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్, చివరిగా మే 24న రాజస్థాన్ రాయల్స్తో ఉన్నాయి. తదుపరి మ్యాచ్లో ఓడిపోతే, ప్లేఆఫ్ రేసు నుండి సాంకేతికంగా నిష్క్రమించినట్టే. టాప్-4లో నిలవడానికి ముంబైకి మిగిలిన అన్ని మ్యాచ్లలో గెలుపు అవసరం. అంతేకాకుండా, ఇతర జట్ల ఫలితాలు కూడా వారికి అనుకూలంగా ఉండాలి.












Click it and Unblock the Notifications