మోడీ విజిట్: తెలంగాణలో ఆరు, సీమాంధ్రలో నాలుగు

తెలంగాణలో కనీసం ఆరు సీట్లను, సీమాంధ్రలో నాలుగు సీట్లను బిజెపి నాయకులు గుర్తించారు. వీటిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని భావిస్తోంది. తెలంగాణలోని సికింద్రాబాద్, మల్కాజిగిరి, జహీరాబాద్, కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్నగర్ సీట్లపై బిజెపి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఈ సీట్లలో పోటీ చేసే అభ్యర్థులను కూడా దాదాపుగా ఖరారు చేసినట్లు భావిస్తున్నారు.
మహబూబ్నగర్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డిని పోటీకి దించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి ఆయన తెలంగాణ నగారా సమితిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ సమక్షంలో బిజెపిలో చేరారు. కరీంనగర్ నుంచి బిజెపి ప్రధాన కార్యదర్శి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావును పోటీకి దించవచ్చునని అంటున్నారు. అయితే, ఈ సీటు నుంచి గతంలో మాజీ కేంద్ర మంత్రి సిహెచ్ విద్యాసాగర రావు గెలిచారు. విద్యాసాగర రావును మరో సీటుకు మారుస్తారా అనేది చూడాల్సి ఉంది.
కాగా, సికింద్రాబాద్ నుంచి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ మరోసారి పోటీకి దిగే అవకాశాలున్నాయి. ఆయన గతంలో ఈ సీటు నుంచి విజయం సాధించారు. బద్దం బాల్ రెడ్డి హైదరాబాద్ నుంచి పోటీకి దిగుతారా, మల్కాజిగిరి నుంచి పోటీకి దిగుతారా అనేది తెలియడం లేదు. అయితే, మల్కాజిగిరి నుంచి సీనియర్ నేత ఎన్ ఇంద్రసేనా రెడ్డిని పోటీకి దించే అవకాశాలున్నాయి.
గతంలో ఎన్డీయె ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కృష్ణంరాజు బిజెపిలోకి తిరిగి వచ్చినట్లే. ఆయన రాజమండ్రి నుంచి లోకసభకు పోటీకి దిగే అవకాశాలున్నాయి. లోకసభ ఎన్నికలకు సంబంధించి బిజెపి జాతీయ నాయకత్వం ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఏ మేరకు ఆంధ్రప్రదేశ్లో లోకసభ సీట్లను సాధిస్తే ఆ మేరకు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పనికి వస్తుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications