నరేంద్రమోడీ: బిజెపిలోకే కృష్ణంరాజు, రాజమండ్రిపై ఆశ!
హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి, రెబల్ స్టార్ కృష్ణం రాజు భారతీయ జనతా పార్టీ మొగ్గు చూపుతున్నారు! గత కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న కృష్ణం రాజు తిరిగి పాతగూటికే చేరుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆదివారం హైదరాబాదుకు వచ్చిన గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ఎన్నికల ప్రచార సారథిన నరేంద్ర మోడీకి స్వాగతం పలికిన వారిలో కృష్ణం రాజు కూడా ఉన్నారు.
మోడీ ఉదయం పదిగంటల సమయంలో బేగంపేట విమానాశ్రయానికి వచ్చారు. ఆయనకు స్వాగతం పలికిన వారిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, సీనియర్ నేతలు విద్యాసాగర రావు, నాగం జనార్ధన్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులతో పాటు కృష్ణం రాజు కూడా ఉన్నారు. గతంలో ఆయన బిజెపిలో పని చేశారు. ఆయన కేంద్ర సహాయ మంత్రిగా అటల్ బిహారీ వాజపేయి హయాంలో పని చేశారు.
2004 తర్వాత కూడా ఆయన బిజెపిలో కొనసాగారు. ఆ తర్వాత క్రమంగా బిజెపికి దూరమయ్యారు. 2008లో ప్రస్తుత కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అప్పుడు ప్రజారాజ్యం పార్టీ స్థాపించడంతో అందులో చేరారు. 2009 సాధారణ ఎన్నికలలో రాజమండ్రి నుండి చిరంజీవి పార్టీ తరఫున పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ నుండి మురళీ మోహన్, కాంగ్రెసు నుండి ఉండవల్లి అరుణ్ కుమార్ పోటీ చేశారు.
అయితే ఆ ఎన్నికల్లో ఇద్దరు నటులు ఓడిపోయి, ఉండవల్లి గెలుపొందారు. ఆ తర్వాత చిరంజీవి తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడం తదితర పరిణామాల నేపథ్యంలో కృష్ణం రాజు ప్రజారాజ్యం పార్టీకి దూరమయ్యారు. కృష్ణం రాజు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరవచ్చుననే ప్రచారం సాగింది. అయితే ఆయన తాజాగా మోడీకి ఆహ్వానం పలకడం వంటి పరిణామాలు గమనిస్తుంటే తిరిగి పాతగూటికే చేరనున్నారని తెలుస్తోంది.
బిజెపి తరఫున ఆయన రాజమండ్రి నుండే మళ్లీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే బిజెపి నుండి కృష్ణం రాజు, తెలుగుదేశం పార్టీ నుండి మురళీ మోహన్, కాంగ్రెసు పార్టీ నుండి ఉండవల్లి అరుణ్ కుమార్ లేదా జయప్రదలు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే రాజమండ్రి వచ్చే ఎన్నికలలో మళ్లీ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.