వైయస్ది మేం పూర్తిచేశాం, సంతోషించండి: జగన్కు డిగ్గీ
2004లో కాంగ్రెసు పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు కూడా పెట్టుకున్నామన్నారు. విభజనపై తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ఆ పార్టీని కోరుతున్నానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నట్లు వైయస్ కూడా సభలోనే ప్రకటన చేశారన్నారు. వైయస్ పట్ల కాంగ్రెస్కు ఎప్పుడూ ఉన్నతమైన అభిప్రాయంతోనే ఉందని, ఆయన డైనమిక్ లీడరని, రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ఏర్పడితే వైయస్ ప్రయత్నాలు కూడా ఫలించినట్లుగానే భావించాలన్నారు.
అదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్ఠానాన్ని ధిక్కరించలేదని, ఆయనపై చర్యలు ఉండవని స్పష్టం చేశారు. శనివారం ఢిల్లీలో దిగ్విజయ్ సింగ్ రెండుమార్లు మీడియాతో మాట్లాడారు. "సిడబ్ల్యూసి, యూపిఏ రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాయి. దానికి అనుగుణం గా కేంద్ర ప్రభుత్వ ప్రక్రియ సాగుతుంది'' అని తెలిపారు.
మంగళవారం సాయంత్రం నుంచి ఆంటోనీ కమిటీ పనిచేయడం ప్రారంభిస్తుందన్నారు. "ఆంటోనీ కమిటీకి, ప్రభుత్వ ప్రక్రియకూ సంబంధం లేదు. సిడబ్ల్యూసి తీర్మానం మేరకు ప్రభుత్వ ప్రక్రియ కొనసాగుతుంది'' అని తెలిపారు. పార్టీలన్నిటితో మాట్లాడిన తర్వాతే, అన్ని విషయాలు క్షుణ్నంగా అధ్యయనం చేసిన తర్వాతే కాంగ్రెస్ విభజనపై నిర్ణయానికి వచ్చిందన్నారు. దీనిని విద్యార్థులు, ప్రభుత్వోద్యోగులు అర్థం చేసుకోవాలని కోరారు.
విభజన నేపథ్యంలో సీమాంద్రులకు భయం అక్కర్లేదని దిగ్విజయ్ మరోసారి భరోసా ఇచ్చారు. సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగులు, ఎన్జీవోలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. నిరసనలు, సమ్మెలను విరమించుకోవాలని కోరారు. మీ సమస్యలన్నీ ఆంటోనీ కమిటీకి చెప్పుకోవచ్చన్నారు. వాటన్నింటినీ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్లలో అన్ని ప్రాంతాల విద్యార్థులు చదువుతున్నారని ఆయన గుర్తుచేశారు.
భారత దేశంలో ఎవరైనా, ఎక్కడైనా నివసించే స్వేచ్ఛ ఉంది. ప్రతి పౌరుడూ దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చునని తెలిపారు. కలిసి కట్టుగా పనిచేసి ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని అభ్యర్థించారు. రాయలసీమ, ఆంధ్ర ప్రాంతంలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ గురించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రస్తావించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఆంటోనీ కమిటీ కాంగ్రెస్ పార్టీ కమిటీ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్న సంగతి ప్రస్తావించగా... తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ టిడిపి ఇచ్చిన లేఖ తమ వద్ద ఉందని, బాబు దానిని వెనక్కి తీసుకోవచ్చు కానీ, కాంగ్రెస్ మాత్రం వెనక్కి తగ్గదన్నారు.