మోడీ సభకు లక్షా20 వేల మంది యువకులు నమోదు
హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ఎన్నికల ప్రచార సారథి నవ భారత యువ భేరీ సభకు లక్షా ఇరవై వేల మంది యువ ప్రతినిధులు తమ పేర్లను నమోదు చేయించుకున్నారని ఆ పార్టీ తెలిపింది. బిజెపి రాష్ట్ర శాఖ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న నవ భారత యువ భేరీ సదస్సు ఆదివారం మధ్యాహ్నం జరగనుంది. ఈ రోజు పది పదకొండు గంటల మధ్య మోడీ హైదరాబాద్ రానున్నారు.
సభా వేదిక వద్ద మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. నరేంద్ర మోడీ సభా ప్రాంగణానికి 3 గంటలకు చేరుకుంటారు. రాష్ట్రానికి చెందిన పార్టీ జాతీయ నేత వెంకయ్య నాయుడు, జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, విద్యాసాగర్రావు, ఇంద్రసేనారెడ్డి, లక్ష్మణ్ వంటి నేతలు నరేంద్ర మోడీ కంటే ముందే ప్రసంగిస్తారు. చివరగా మోడీ ప్రసంగిస్తారు. సదస్సు సాయంత్రం ఆరు, ఆరున్నర గంటల మధ్య ముగిసే అవకాశముంది.
సదస్సు జరిగే ఎల్బీ స్టేడియంలో పార్టీ రాష్ట్ర నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 78 వేల మంది ప్రతినిధులకు సరిపడా ఏర్పాట్లు చేసినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. సాధారణంగా ఎల్బీ స్టేడియంలో 45 వేల మందికి సీటింగ్ కెపాసిటీ ఉంది. క్రికెట్, ఇతర క్రీడల సందర్భంగా స్టేడియంలో ఉన్న 45 వేల సీట్లకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ టికెట్లు అమ్ముతుంటుంది. కానీ తాము మొత్తం 48 వేల మందిని సీట్లలో కూర్చోబెట్టేలా సౌకర్యాలు కల్పించామని కిషన్ రెడ్డి చెప్పారు.
స్టేడియం మధ్యలో మరో 30 వేల మందికి సీట్లు వేయించామని, మొత్తం 78 వేల మందిని కూర్చోబెడతామని కిషన్ రెడ్డి వివరించారు. శనివారం నాటికి 1.20 లక్షల యువ ప్రతినిధులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని వివరించారు. ఇందులో 25 వేలమంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగా మిగతా వారు ఆఫ్లైన్గా నమోదు చేసుకున్నారన్నారు.
పెద్ద మొత్తంలో యువత తరలివస్తే వారిని నియంత్రించడం కష్టంగా మారే అవకాశముందన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే ఎల్బీ స్టేడియమే కాకుండా నిజాం కాలేజీ మైదానాన్ని కూడా అద్దెకు తీసుకున్నామని కిషన్ రెడ్డి చెప్పారు. అక్కడ పెద్ద పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశామని, మోదీ ప్రసంగాన్ని అక్కడ కూడా వీక్షించవచ్చని తెలిపారు. ఇదే మొదటి సభ... బిజెపి ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్గా నరేంద్ర మోడీ ఎన్నికయ్యాక ఆయన ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా 100 ప్రజాబహిరంగ సభలను నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. హైదరాబాదులోనే మొదటి సభ.
మోడీ సదస్సుకు సీమాంధ్ర సెగ
తెలంగాణ ప్రకటన నేపథ్యంలో ఎగిసిపడుతోన్న సీమాంధ్ర ఉద్యమ సెగ నరేంద్ర మోడీ సదస్సుకూ తాకింది. కోస్తాంధ్ర, రాయలసీమ నుంచి ఆశించిన స్థాయిలో యువ ప్రతినిధులు హాజరు కావడం లేదు. తెలంగాణ ప్రాంతం నుంచి కాస్త ఎక్కువ మంది యువ ప్రతినిధులు హాజరవుతారని అనుకున్నా కోస్తాంధ్ర, రాయలసీమ నుంచి కూడా ఆశాజనకమైన సంఖ్యలోనే ప్రతినిధులు వస్తారని కమలనాథులు మొదట్లో అంచనా వేశారు.
ఆ రెండు ప్రాంతాల నుంచి కనీసం 12-15 వేల వరకు యువ ప్రతినిధులు వస్తారని బిజెపి సీమాంధ్ర ప్రాంత నేతలు పార్టీ రాష్ట్ర కార్యవర్గానికి చెప్పారు. కానీ తెలంగాణ ప్రకటన నేపథ్యంలో పార్టీపై సీమాంధ్రలో వ్యక్తమవుతోన్న వ్యతిరేక భావంతో ప్రతినిధుల రాక తగ్గినట్లు తెలిసింది.