కౌంటింగ్ వేళ.. రోడ్ సైడ్ డ్రైనేజీలో వీవీప్యాట్ స్లిప్పులు- ఏం జరుగుతోంది
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వీవీప్యాట్ (VVPAT) స్లిప్లు ఎక్కడపడితే అక్కడ చెల్లాచెదురుగా కనిపించాయి. రోడ్ సైడ్ డ్రైనేజీలో, చెత్తకుప్పల్లో పడి ఉండటం తీవ్ర కలకలం రేపింది. తృణమూల్ కాంగ్రెస్ కు గట్టి పట్టు ఉన్న ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ఆ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
నువాపారా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఈ స్లిప్లు నీల్గంజ్ సుభాష్నగర్లోని ఓ పెట్రోల్ బంకు సమీపంలో లభ్యం కావడం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై నువాపారా అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి అర్జున్ సింగ్ కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన.. తృణమూల్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.

నువాపారా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గరులియాలోని బూత్ నంబర్ 29కి చెందిన వీవీప్యాట్ స్లిప్పులుగా గుర్తించారు. అవన్నీ కూడా మధ్యమ్గ్రామ్ నియోజకవర్గం పరిధిలోని సుభాష్నగర్ సమీపంలో గల చెత్తకుప్పలో లభించాయి. ఇది ఎలా సాధ్యమైందంటూ బీజేపీ నాయకురాలు లాకెట్ ఛటర్జీ మండిపడ్డారు. వీవీప్యాట్ స్లిప్లను సంబంధిత ఈవీఎంలతో పాటు స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరచాల్సి ఉన్నప్పటికీ వాటిని చెత్తలో పడవేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులను గుర్తించాలని, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏ విధంగానూ ప్రభావితం కాకుండా చూడాలని అటు బీజేపీ అభ్యర్థి అర్జున్ సింగ్ కూడా ఎన్నికల సంఘాన్ని కోరారు. మరోవైపు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ సలీం ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ స్లిప్పుల్లో ఎక్కువ భాగం తమ పార్టీ అభ్యర్థికి సంబంధించినవేనని పేర్కొన్నారు. దీనిపై మరింత స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. వీటిని మాక్ పోల్ కు సంబంధించినవని ప్రాథమిక విచారణలో తేల్చింది. దీనిపై విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశించింది. నివేదిక అందిన తర్వాత అవసరమైన, కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications