అది మా రక్తంలోనే ఉంది: భరతమాత నొసటిన తిలకం: నిండు సభలో తేల్చి చెప్పిన విజయ్
ముఖ్యమంత్రి విజయ్ తమిళనాడు శాసనసభలో ఓ కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహించే అధికారిక కార్యక్రమాల ప్రారంభంలోనే విధిగా 'తమిళ్ తాయ్ వాళ్తు' (తమిళ తల్లికి వందనం) గీతాన్ని ఆలపించడానికి ఉద్దేశించిన తీర్మానం ఇది. ఈ మధ్యకాలంలో రాష్ట్ర గీతాలాపన ప్రొటోకాల్ చుట్టూ చోటు చేసుకుంటోన్న వివాదాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు విజయ్ స్వయంగా ఈ ప్రతిపాదనను సభ ముందుకు తెచ్చారు.
టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోతోందనే విమర్శలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. టీవీకే ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవంలో వందేమాతరం గీతానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడానికి దీనికి కారణమైంది. తమిళ తాయ్ వాళ్తును ఏకంగా మూడో స్థానానికి పరిమితం చేయడం.. దీనికి ఆజ్యం పోసింది. మంత్రుల ప్రమాణ స్వీకార వేడుకల్లో కూడా ఇదే విధానం పునరావృతం కావడంతో ప్రతిపక్షాల నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

ఇటీవల మనోన్మణీయం సుందరనార్ యూనివర్శిటీ ఉత్సవాల్లో కూడా రాష్ట్ర గీతాన్ని మూడో స్థానంలో ఆలపించడంతో ఇది తీవ్రరూపం దాల్చింది. గవర్నర్ అధికారిక కార్యక్రమాల్లో కూడా ఈ గీతాన్ని పక్కనబెడుతున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. రాజ్ భవన్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే తాము ఇలా చేయాల్సి వచ్చిందంటూ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ వివరణ ఇచ్చారు అప్పట్లో. ఇది దుమారం రేపింది.
ఈ నేపథ్యంలో.. విజయ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా విజయ్ భావోద్వేగంగా మాట్లాడారు. తమిళం అనేది ఓ భాష మాత్రమే కాదని, అది తమ రాష్ట్ర అస్తిత్వానికి, ఊపిరికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రాంతీయ భాష తమిళం అని, తమ సంస్కృతి అత్యంత ప్రాచీనమైనదని గుర్తు చేశారు. తమిళం అంటే ప్రేమ, తమిళం అంటే పవర్, తమిళం అంటే గర్వం.. అనివ్యాఖ్యానించారు. ఇకపై అన్ని అధికారిక కార్యక్రమాల్లో కూడా ఈ గేయాన్ని ప్రారంభంలోనే ఆలపించాలని ఆదేశించారు.
ఈ గీతానికి సుదీర్ఘమైన చారిత్రక నేపథ్యం ఉంది. 1891లో ప్రముఖ రచయిత మనోన్మణీయ సుందరనార్ రాసిన నాటకంలోని శ్లోకాల ఆధారంగా ఈ గీతం రూపుదిద్దుకుంది. 1970 నవంబర్ 23 నుంచి తమిళనాడు ప్రభుత్వ అధికారిక వేడుకల ప్రారంభంలో దీనిని ఆలపించాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. అనంతరం 2021 డిసెంబర్ 17న దీనిని అధికారిక రాష్ట్ర గీతంగా గుర్తిస్తూ జీవో జారీ అయింది. దీంతో దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది.
తమిళం.. భరతమాత నొసటిపై తిలకం వంటిదని, ఆ ప్రస్తావన వస్తే రాష్ట్ర ప్రజలంతా ఏకతాటిపై నిలుస్తారని సీఎం విజయ్ స్పష్టం చేశారు. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడకూడదని, రాష్ట్ర హక్కుల పరిరక్షణగా భావించాలని కోరారు. అభిప్రాయభేదాలను పక్కనబెట్టి సభ్యులందరూ ఏకగ్రీవంగా ఈ తీర్మానానికి మద్దతు ప్రకటించాలని విజయ్ పిలుపునిచ్చారు. దీనికి అనుగుణంగా ఈ తీర్మానానికి డీఎంకే, అన్నాడీఎంకే మద్దతు ప్రకటించాయి.





Click it and Unblock the Notifications