శంషాబాద్ వద్ద ఇన్నోవా ప్రమాదం: నలుగురు దుర్మరణం
గణేష్ నిమజ్జన వేడుకలలో పాల్గొని ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగి వస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు.. ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరు తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని పాలమాకుల వద్ద జాతీయ రహదారి 44 పై ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. గణనాథుడిని సాగనంపిన ఆనందంలో ఉన్న ఆ కుటుంబంలో ఈ ప్రమాదం ఊహించని శోకాన్ని నింపింది.
మృతులందరూ మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలానికి చెందిన మెట్టుగడ్డ తండా వాసులుగా గుర్తించారు. వీరంతా కూడా తమ స్వగ్రామంలో జరిగిన వినాయక నిమజ్జనం ఉత్సవాల్లో ఆనందంగా పాల్గొన్నారు. తిరిగి శంషాబాద్ వైపు ఇన్నోవాలో వెళ్తోండగా మార్గమధ్యలో ప్రమాదం సంభవించింది. పాలమాకుల సమీపంలో కారు అదుపు తప్పింది. బోల్తా కొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం మొత్తం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది.

ఈ ఘటనలో మరణించిన వారిని కేతావత్ లింబ్యా, ఆయన భార్య కేతావత్ జమున, కత్రావత్ మాన్సింగ్, కేతావత్ వాస్రామ్ గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సబావత్ అశోక్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. సమాచారం అందిన వెంటనే జాతీయ రహదారి పెట్రోలింగ్ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
డ్రైవర్ అశోక్ను కారు నుంచి వెలికి తీయడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. అనంతరం అత్యవసర చికిత్స నిమిత్తం శంషాబాద్ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగానే ఉందని తెలుస్తోంది. మృతదేహాలను కారులో నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మరణించారనే విషయం తెలియడంతో మెట్టుగడ్డ తండాలో విషాదఛాయలు అలముకున్నాయి.
నిమజ్జన వేడుకల అనంతరం సంతోషంగా తిరిగి రావాల్సిన కుటుంబం ఇలా రోడ్డు ప్రమాదంలో విగతజీవులుగా మారడం తండావాసులను కలచివేసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత సుదీర్ఘ ప్రయాణం చేయడం, డ్రైవర్ నిద్రమత్తు వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. సుదీర్ఘ ప్రయాణాలు చేసేటప్పుడు నిద్రమత్తు, మితిమీరిన వేగం ప్రాణాంతకంగా మారుతాయని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.












Click it and Unblock the Notifications
