తిరుమల లడ్డూలో కల్తీ వ్యవహారంలో అనూహ్య మలుపు: బిగ్ షాట్ అరెస్ట్
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలకు దిగింది. కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేసిన సుకృతి ఫుడ్స్ ప్రమోటర్ కైలాష్ చంద్ మంగ్లాను ఈడీ అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ కింద ఆయనను అదుపులోకి తీసుకుంది. అనంతరం విశాఖపట్నం పీఎమ్ఎల్ఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం నిందితుడికి జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఈ అరెస్ట్ పై ఈడీ ఓ సుదీర్ఘ ప్రకటన విడుదల చేసింది.
శ్రీవారి ప్రసాదం తయారీ కోసం ముడి సరుకుగా ఉపయోగించిన నెయ్యిలో భారీ స్థాయిలో కల్తీ జరిగినట్లు ఈడీ దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో సరఫరా చేసిన నెయ్యిలో ఈ కల్తీ చోటు చేసుకున్నట్లు గుర్తించింది. టీటీడీ నిబంధనల ప్రకారం.. లడ్డూ తయారీకి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగించాలి. నిందితులు దీని స్థానంలో నెయ్యిలో రిఫైన్డ్ పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామోలిన్ను ఉపయోగించారు. కల్తీ నెయ్యిని తయారు చేసి టీటీడీకి సరఫరా చేశారు.

పామాయిల్ మాత్రమే కాకుండా నెయ్యికి చిక్కదనాన్ని, సువాసనను తెప్పించడానికి, దాన్ని ఆవు నెయ్యిగా నమ్మించడానికి, పూసల రూపంలో కనిపించే ప్రయత్నం చేశారు తయారీదారులు. దీనికోసం కెమికల్స్ సైతం వినియోగించినట్లు ఈడీ పేర్కొంది. ఇందులో ఎంజీ 90, మైవాసెట్ సాఫ్ట్ 400, మోనోగ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ వంటి రసాయనాలను వాడినట్లు తేల్చింది. వీటన్నింటినీ మిశ్రమంగా మార్చి చివరకు టీటీడీ అధికారులను బురిడీ కొట్టించేలా ఆగ్ మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యిగా ముద్ర వేసి సరఫరా చేశారని ఈడీ అధికారులు వెల్లడించారు.
టీటీడీకి సరఫరా చేసిన ఈ కల్తీ నెయ్యి సరఫరాల మొత్తం విలువ దాదాపు 230 కోట్ల రూపాయలుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో కైలాష్ చంద్ మంగ్లా ఒక్కడే తన సొంత డైరీ ఫ్యాక్టరీలో దాదాపు రూ. 96 కోట్ల విలువైన కల్తీ నెయ్యిని ఉత్పత్తి చేశారని ఈ ప్రకటనలో వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో మంగ్లా ఒక ప్రధాన కుట్రదారుడిగా వ్యవహరించాడని, కల్తీకి అవసరమైన రసాయనాలు, నూనెలను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించారని పేర్కొన్నారు.
ఇలా తయారు చేసిన కల్తీ నెయ్యిని నేరుగా అమ్మితే అనుమానం వస్తుందని గ్రహించిన నిందితుడు, పలు ఇతర డెయిరీ సంస్థలను కూడా రంగంలోకి దించారు. ఇందులో శ్రీ వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్, మల్ గంగ మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్, ఏఆర్ డెయిరీ ఫుడ్స్ వంటి కంపెనీల సహాయంతో ఈ నకిలీ నెయ్యిని తిరుమలకు రవాణా చేశారు. ఈ క్రమంలో నిందితులు కోట్లాది రూపాయల ఆర్థిక లావాదేవీలను సాగించినట్లు తెలిపారు.
బ్యాంకు లావాదేవీలు, అకౌంటింగ్ లో కూడా తీవ్ర అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఈడీ అధికారులు నిర్ధారించారు. కల్తీ పదార్థాల అసలు వినియోగాన్ని అధికారుల దృష్టి పడకుండా దాచడానికి, ఆవు నెయ్యి కొనుగోళ్ళు చట్టబద్ధంగానే జరిగాయని భ్రమ కల్పించడానికి కైలాష్ చంద్ నకిలీ విక్రయ, కొనుగోలు రికార్డులను సృష్టించారు. ఇది.. పీఎమ్ఎల్ఏ చట్టాల ప్రకారం ఇది మనీలాండరింగ్ కిందికి వస్తుందని ఈ ప్రకటనలో పొందుపర్చారు.
ఈ కేసులో ఈడీ చర్యలు వేగవంతం కాగా గతంలో భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రమోటర్, డైరెక్టర్ విపిన్ జైన్ను కూడా ఈడీ అధికారులు ఇదే తరహా ఆరోపణలపై అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోట్లాది మంది భక్తుల విశ్వాసంతో పాటు పవిత్రమైన హిందూ సాంప్రదాయాలతో కూడిన దేవాలయంలో కల్తీ నెయ్యి వినియోగించడం చర్చనీయాంశంగా మారింది.















Click it and Unblock the Notifications
