సిఎంగా చేస్తోంది నేను కాదు!: సినీ ప్రముఖులతో మోడీ
మోడీని పలువురు ప్రముఖులు కలుస్తున్న విషయం తెలిసిందే. వారితో మాట్లాడుతూ.. నా విజయాలలో ఆరుకోట్ల గుజరాతీయుల పాత్ర ఎంతో ఉందని చెప్పారు. తాను సిఎంగా పని చేయడం కంటే తాను సెట్ చేసిన మౌలిక సదుపాయాలే ఆ పని చేశాయని చెప్పారు.
భవిష్యత్తులో కూడా దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకే తాను దేశవ్యాప్తంగా యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. ఈ యాత్రను తాను హైదరాబాదు నుండే ప్రారంభించాలని భావించి వచ్చానన్నారు. ఎవరి రంగంలో వారు దృష్టి పెడితే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా, తనను కలిసిన ప్రముఖులను నరేంద్ర మోడీ పార్టీలోకి ఆహ్వానించడం లాంటివి చేయలేదని సమాచారం. వారు మర్యాదపూర్వకంగా కలవడంతో ఆయన కూడా వారి వారి రంగాల విషయం పైనే చర్చించారు.
నవ భారత యువ భేరీ సభకు భారీగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. జనంతో ఎల్బీ స్టేడియం నిండిపోయింది. దీంతో పోలీసులు గేట్లు మూసివేశారు. తర్వాత వస్తున్న వారిని లోనికి అనుమతించలేదు. అభిమానులు లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో రెండు గేట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అనంతరం నిజాం కళాశాలలో ఎల్ఈడి తెరల ద్వారా మోడీ ప్రసంగం వినేందుకు స్టేడియం వెలుపల ఏర్పాట్లు చేశారు.