మమతా బెనర్జీ 72 గంటల డెడ్లైన్, తగ్గని జిజెఎం
72 గంటలు సమయమిస్తున్నానని, బంద్ ఉపసంహరించుకోవాలని, బంద్లు రాజ్యాంగవిరుద్ధమని సుప్రీం కోర్టు చెప్పిందని, ఆందోళనలు విరమించుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డార్జిలింగ్ పర్వత ప్రాంతంలో సాధారణ పరిస్థితులు తీసుకురావాలని కలకత్తా హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో శనివారం రాష్ట్ర సచివాలయంలో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఉగ్రరూపం దాల్చారు. ఎనిమిది రోజులుగా సహించానని చెప్పారు.
ఇక కఠిన చర్యలు తీసుకునేలా చేయొద్దని ఆమె హెచ్చరించారు. డార్జిలింగ్లో బలవంతంగా బంద్ చేయించడం ద్వారా జిజెఎం ప్రజల్ని ఇబ్బందిపెడుతోందని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్రం పైనా ఆమె విమర్శలు గుప్పించారు. విభజన రాజకీయాలకు పాల్పడొద్దని అన్నారు.
మమత విధించిన 72 గంటల గడువుపై జిజెఎం కూడా దీటుగా స్పందించింది. ఈ డెడ్లైన్ను వెనక్కి తీసుకోకపోతే ప్రజలే స్వచ్ఛంద కర్ఫ్యూ విధిస్తారని జిజెఎం నేత బిమల్ గురుంగ్ హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన కొనసాగిస్తామని, అణచివేయాలని చూస్తే తగిన జవాబిస్తామని చెప్పారు.