హైదరాబాద్పై సందిగ్ధతను తొలగించాలి: బొత్స ఝాన్సీ
న్యూఢిల్లీ: విభజన విషయంలో హైదరాబాద్పై నెలకొన్న సందిగ్ధతను తొలగించాలని తాము పార్టీ అధిష్టానాన్ని కోరుతామని కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యురాలు బొత్స ఝాన్సీ అన్నారు. వివిధ విషయాలపై స్పష్టత ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని అడుగుతామని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. రైతులు, ఉద్యోగుల అనుమానాలను నివృత్తి చేయాల్సి ఉంటుందని ఆమె అన్నారు.
కమిటీపై సమాచారం లేదు
ప్రభుత్వం తరఫున వేసే కమిటీపై తమకు సమాచారం లేదని, కమిటీ ఎందుకు వేస్తున్నారనేది చెప్పాలని రాయలసీమకు చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకోవడానికి సోమవారం మరోసారి సమావేశమవుతామని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి చిరంజీవి నివాసంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు శనివారం సమావేశమయ్యారు. తాను శుక్రవారం సోనియా వద్ద ప్రస్తావించిన విషయాలను చిరంజీవి వివరించారు. అనంతరం అనంత వెంకట్రామిరెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
సమైక్యాంధ్ర రాష్ట్రం కోసం సీమాంధ్రలో ఉద్యమం ఉధృతమైందని, విద్యార్థులు చదువులు మానేసి ఉద్యమం చేస్తున్నారని ఆయన చెప్పారు. అన్ని పార్టీలు ఏకం కావాలని ఆయన కోరారు. ఏ కమిటీ వేసినా దాని ప్రాతిపదికను, అధికారాలను ముందే చెప్పాలని అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు.
రాయల తెలంగాణ కోరలేదు
తాను సమైక్యాంధ్రనే కోరుకుంటున్నట్లు రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చెప్పారు. జలవివాదాలు పరిష్కరించిన తర్వాతనే రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. రాయల తెలంగాణను కోరుతూ తాను ఎప్పుడూ లేఖ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించకుండా ఎలా పడితే అలా చేస్తారా అని ఆయన అడిగారు. ప్రజల అభీష్టాన్ని నెరవేర్చడం ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యత అని ఆయన అన్నారు.