సోనియా ఆదేశం: విభజనపై చిరంజీవి బుజ్జగిస్తున్నారా?

విభజిస్తే హైదరాబాదు అంశాన్ని తేల్చాలని ఆయన పలుమార్లు డిమాండ్ చేశారు. హైదరాబాదును శాశ్వత ఉమ్మడి రాజధానిగా లేదా కేంద్రపాలిత ప్రాంతంగా ఉండాలని ఆయన అధిష్టానం పెద్దలను కోరారు. అదే విషయాన్ని ఆయన విలేకరుల ముందు కూడా చెప్పారు. అయితే, సమైక్యం కోసం అంతర్గతంగా ప్రయత్నాలు సాగిస్తున్న చిరంజీవి విభజన కోసం సీమంధ్ర కాంగ్రెసు నేతలను కూడా బుజ్జగిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు సమైక్యవాదం నుండి తెలంగాణ వైపు యూ టర్న్ తీసుకొని మళ్లీ సమైక్యగళం వినిపిస్తున్నారు. విభజనకు అంతర్గతంగా సహకరిస్తున్నారనే పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ పైన కూడా ప్రచారం జరిగింది. ఆయన కూడా బయట తాను సీమాంధ్ర ప్రతినిధిగా సమైక్యవాదిని అని చెబుతున్నారు. ఇలా పలువురు నేతలు సమైక్యవాదం వినిపిస్తూ.. అంతిమంగా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతున్నారు. చిరంజీవి మాత్రం హైదరాబాదు, నీటి సమస్యల పైనే ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారంటున్నారు.
ఆయన రెండు రోజుల క్రితం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని కలిశారు. రాష్ట్ర తాజా పరిస్థితులపై చర్చించారు. అధిష్టానం సూచనల మేరకు ఆయన సీమాంధ్ర నేతలను విభజనకు ఒప్పించే పనిలో పడ్డారని అంటున్నారు. అయితే, హైదరాబాదును మాత్రం తప్పకుండా తేల్చాల్సిందేనని ఢిల్లీ పెద్దలకు చెప్పారట. సీమాంధ్ర ప్రజలు హైదరాబాదును వదులుకునే పరిస్థితి లేదని వారికి చెప్పారని అంటున్నారు.
హైదరాబాదు సమస్యకు అధిష్టానం ఓ పరిష్కారం చూపిస్తే.. అనే కోణంలో సీమాంధ్ర నేతలను బుజ్జగిస్తున్నారని అంటున్నారు. కాగా విభజన జరిగితే కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అధిష్టానం కూడా ఆ దిశలో ఆలోచించినట్లుగా ప్రచారం జరిగింది.












Click it and Unblock the Notifications