రాతపూర్వకంగా కారణం చెప్పని జగన్, పేపర్తో టైంపాస్
ఉదయం ఫలహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం తీసుకోకపోవడంతో జైలు అధికారి సైదయ్య రాత్రి ఏడు గంటల సమయంలో జగన్ బ్యారెక్కు వెళ్లి ఆయనతో పదిహేను నిమిషాలు మాట్లాడారు. తాను ఆహారం తీసుకోవడం లేదని జగన్ అధికారితో చెప్పారని సమాచారం. అయితే, ఆహారం తీసుకోకపోవడానికి చాలా కారణాలు చెప్పారని, అవేవీ రాతపూర్వకంగా ఇవ్వలేదని చెప్పారు. ఆయన తనతో చెప్పిన కారణాలు వెల్లడించలేనన్నారు.
రోజంతా ఆహారం తీసుకోకపోవడంతో వెంటనే జైలు వైద్యుడు రామన్ను పిలిపించి జగన్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యంగానే ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఆహారం తీసుకోకపోవడం జైలు నిబంధనలకు విరుద్ధం కాబట్టి జగన్ పైన ఎలాంటి చర్యలు తీసుకోవాన్న దానిపై అధికారులతో చర్చిస్తామన్నారు. జగన్ ఆహారం తీసుకోవడం లేదని అధికారులు చెప్పారు. తద్వారా ఆయన దీక్ష చేస్తున్నారని గుర్తించారు. 24 గంటల తర్వాతే చర్యలని తెలిపారు. రిమాండు ఖైదీ నిరాహార దీక్ష చేయడం నిబంధనలకు విరుద్ధం.
మరోవైపు, దీక్ష చేస్తున్న వైయస్ జగన్కు అధికారులు బలవంతంగా ఏదైనా ఇచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు. సెలైన్ తదితరాలు ఎక్కించి దీక్షను భగ్నం చేసే అవకాశాలున్నాయి. జైలులో దీక్ష చేస్తు అతనిని విచారించే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. మరోవైపు జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జైలువర్గాలు అందించిన వివరాల ప్రకారం... ఆదివారం ఉదయం 6.30 గంటలకు నిద్ర లేచిన జగన్ కాలకృత్యాలు పూర్తి చేసుకుని, ప్రత్యేక ప్రార్థనల అనంతరం జైలు ఓల్డ్ ఆసుపత్రి బ్యారక్లోనే బైఠాయించారు. రోజంతా ఎలాంటి ఆహారమూ, టీ తీసుకోకుండా బ్యారక్కే పరిమితమయ్యారు. దినపత్రికలు చదువుతూ, నిద్రిస్తూ గడిపారు. జగన్ను అక్కడే రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణతోపాటు ఇతర విఐపి ఖైదీలు పరామర్శించి సంఘీభావం తెలిపినట్లుగా తెలుస్తోంది.