తెలంగాణపై లేఖను వెనక్కి తీసుకోం: మురళీమోహన్
తాము తెలంగాణపై లేఖ ఇచ్చి ఆరేళ్లవుతోందని, అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. తెలంగాణపై తమకు ప్రేమా, సీమాంధ్రపై కోపమూ లేదని ఆయన స్పష్టం చేశారు. రెండు ప్రాంతాలు కూడా తమకు రెండు కళ్లలాంటివని ఆయన అన్నారు. విభజనలో రెండు ప్రాంతాలకు సమన్యాయం జరగాలన్నదే తమ ఉద్దేశ్యమని చెప్పారు. ఉద్యోగాలు, నీళ్లు, హైదరాబాద్ విషయాల్లో ఇరు ప్రాంతాలకు కూడా సమన్యాయం జరగాలని ఆయన అన్నారు. తమ పార్టీని దెబ్బ తీసే కుట్రలో భాగంగానే తమపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.
తెలంగాణపై కేంద్రం వెనక్కి పోదు
తెలంగాణపై కేంద్రం వెనక్కి తగ్గబోదని తెలంగాణ ప్రాంతానికి చెందిన పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ స్పష్టం చేశారు. సీమాంధ్ర పరిణామాల నేపథ్యంలో కేంద్రం వెనక్కి పోయిందని అనుకుంటే పొరపాటేనని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిన తర్వాత అందరూ సహకరించాలి తప్ప విద్వేషాలు పెరిగే విధంగా మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు.
ప్రశాంత వాతావరణంలో తమ వాదనను చెప్పుకునే హక్కు ఎపిఎన్జీవోలకు ఉందని డిఎస్ అభిప్రాయపడ్డారు. ఎపిఎన్జీవోల హైదరాబాద్ సభకు అనుమతి ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని ఆయన అన్నారు.