ఎపిఎన్జీవోల సభ: రేపు అర్థరాత్రి నుంచి తెలంగాణ బంద్
హైదరాబాద్: శనివారంనాడు హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఎపి ఎన్జీవోలు సమైక్యాంధ్ర సభన నిర్వహిస్తున్న నేపథ్యంలో తెలంగాణ జెఎసి తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది. రేపు శుక్రవారం అర్థరాత్రి నుంచి ఎల్లుండి శనివారం 5 గంటల వరకు బంద్ పాటించాలని తెలంగాణ జెఎసి నిర్ణయించింది. గురువారం జరిగిన తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తలుచుకున్నారు కాబట్టే పోలీసులు ఎపిఎన్జీవోల సభకు అనుమతించారని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ మీడియా ప్రతినిధులతో అన్నారు. శాంతి ర్యాలీకి అనుమతి ఇవ్వబోమని పోలీసులకు తమకు రాతపూర్వకంగా తెలియజేయలేదని ఆయన అన్నారు. విద్యార్థులపై రౌడీ షీట్ కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.
శనివారంనాడు ఎపిఎన్జీవోలు ఎల్బీ స్టేడియంలో తలపెట్టిన సభకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అదే రోజు తెలంగాణ ఎన్జీవోలు నిజాం కళాశాల మైదానంలో తలపెట్టిన శాంతి ర్యాలీకి అనుమతి నిరాకరించారు. మరో రోజున తెలంగాణ ఎన్జీవోలు సభ నిర్వహించాలనుకుంటే అనుమతి ఇస్తామని, మొదట ఎపి ఎన్జీవోలు తమను సంప్రదించారు కాబట్టి అనుమతి ఇచ్చామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అనురాగ శర్మ చెప్పారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తెలంగాణ జెఎసి నాయకులకు ఫోన్ చేశారు. బంద్ సందర్భంగా వివాదాలకు దారి తీయకుండా శాంతియుతంగా నిరసన తెలియజేయాలని ఆయన జెఎసి నేతలకు సూచించారు. ఎపిఎన్జీవోల సభతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆగేది కాదని ఆయన అన్నారు. ఇలాంటి సయమంలోనే సంయమనం పాటించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
వివాదాలు నెలకొంటే సీమాంధ్రులు వాటిని బూచీగా చూపించే అవకాశం ఉందని కెసిఆర్ అన్నారు. తెలంగాణవాదులను రెచ్చగొట్టేందుకే సభను నిర్వహిస్తున్నారని తెలిసిన తర్వాత వ్యూహాత్మకంగా ఉండడమే మంచిదని ఆయన అన్నారు.