దాహమో రామచంద్రా.. గుక్కెడు నీళ్లు లేక అవస్థ, ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇదీ
అసలే ఎండలు.. ఆపై ఉక్కపోత... దాహం తీరడానికి మంచినీరు కంపల్సరీ. కానీ ఇప్పటికీ కొన్ని గూడెలు, మారుమూల ప్రాంతాల్లో తాగేందుకు మంచినీరు దొరకడం లేదు. జలాశయాల్లో నీటిమట్టాలు పడిపోవడం.. బోర్లు, బావులు ఎండిపోతున్నాయి. చాలా చోట్ల ట్యాంకర్లు, చలమనీరే ఆసరా అవుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది.
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భూగర్భ జల మట్టాలు తగ్గిపోతున్నాయి. బోరు బావుల తవ్వకాలు, వేడి తీవ్రత నిరంతరంగా కొనసాగుతుండటం, 24 గంటల ఉచిత విద్యుత్ కారణంగా బోర్ల వినియోగం పెరిగిపోతోంది. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. గత ఏడాది గానే ఈసారి కూడా భూగర్భ జలాల మట్టం పడిపోవడం ప్రమాద సంకేతాన్ని అందిస్తోంది. నెల రోజుల్లో నీటి మట్టం కనిష్ట స్థాయికి చేరుకునే ప్రమాదం ఉందనే భూగర్భ జలశాఖ అధికారులు చెబుతున్నారు.
ప్రాజెక్టులు.. చెరువులు.. కుంటల్లో నీటి మట్టాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. జైనూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, లింగపూర్, బెల, సిర్పూర్ యు, వాంకిడి, భీమిని, లోమి లాంటి ఆదివాసీ గ్రామాలు, తండాల్లో నీటి కష్టాలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ప్రభుత్వం తమకు మంచినీటి సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఏజెన్సీ ప్రాంతంలోనే కాకు గుట్ట మీద పల్లెలు.. మైదాన ప్రాంతాల్లో.. ప్రత్యామ్నాయ చర్యలను ఇప్పటి నుంచే చేపట్టాలని కోరుతున్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఈ ఏడాది ఇంటింటికీ తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ .. రావడం లేదంటూ మండిపడుతున్నారు. ప్రజలకు మంచినీరు నిత్యావసరం.. దానిని తీర్చాల్సిన బాధ్యత పాలకులపై ఉంది.