ప్రతిపక్ష నేతలకు లేని రక్షణ, తులసీరెడ్డిపై దాడిని ఖండించిన చంద్రబాబు
వైసీపీ నేతల అరాచకాలు పరాకాష్టకు చేరాయని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఎన్నికల ఫలితాలను ఏకపక్షంగా చేసేందుకు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేత తులసిరెడ్డిపై వైసీపీ శ్రేణుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతలకు వైసీపీ ప్రభుత్వం రక్షణ లేకుండా చేస్తోందని దుయ్యబట్టారు.
అంతకుముందుకడప జిల్లా వేంపల్లెలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డిని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. తులసిరెడ్డిపై వైసీసీ కార్యకర్తలు చేసిన దాడిని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఖండించారు.
ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్పై కేసు నమోదు చేశారు. కుప్పం మండలం వీ మిట్టపల్లి వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని బెదిరించినట్టు మనోహర్పై కేసు నమోదు చేశారు. ఎలాంటి సంబంధం లేకపోయినా రాజకీయ కక్షతో కేసు నమోదు చేశారని మనోహర్ ఆరోపించారు. పీఏ మనోహర్తోపాటు వీ మిట్టపల్లి టీడీపీ అభ్యర్థి మంజునాథ్పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
రెండో విడత పంచాయతీ ఎన్నికలు శనివారం జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్కు ఏర్పాట్లు చేస్తారు. పోలింగ్, కౌంటింగ్ పర్యవేక్షణకు ప్రతి మూడు మండలాలకు ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్టు పంచాయతీరాజ్ ఉన్నత అధికారులు తెలిపారు.