అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి.. ప్రభుత్వానికి చంద్రబాబు డిమాండ్
ఏపీ సర్కార్ తీరుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఫైరయ్యారు. కరోనా పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. అందరినీ కలుపుకుపోవాల్సిన అవసరం ఉందన్నారు. తాజా పరిస్థితులపై చర్చించడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ పార్టీ శ్రేణులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలో కొవిడ్ స్థితిగతులపై ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచారు. కరోనా నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని కోరారు. కరోనా బాధితులకు ఇస్తున్న సాయం, ఇతర అంశాలపై జగన్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఆక్సిజన్ అందక మరణించిన వారి సంఖ్య విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. కరోనా మృతుల కుటుంబాలకు సాయం చేసే విషయంలో ఏ చర్యలు తీసుకున్నారో వివరించాలని అడిగారు.
ప్రతి ఒక్కరికీ కరోనా టీకా ఇచ్చేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. కరోనా మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు సాయం చేస్తామన్న సర్కారు, తన మాట నిలుపుకోవాలని హితవు పలికారు. కరోనా మృతులకు గౌరవప్రదంగా ప్రభుత్వమే దహన సంస్కారాలు నిర్వహించాలని సూచించారు.ఇతర కారణాలతో మరణించిన కరోనా రోగుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఇస్తే బాగుంటుందని చెప్పారు.
కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వారికి రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం చేయాలని సజెస్ట్ చేశారు. కరోనా సంక్షోభ సమయంలో వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా ఔషధాలు, ఆక్సిజన్ సరఫరా, ఆసుపత్రుల్లో పడకల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.