ముగిసిన ఏపీ ఎన్నికల కౌంటింగ్, వైసీపీ హవా.. జగన్ థాంక్స్
ఆంధ్రప్రదేశ్లో 6,985 ఎంపీటీసీ, 441 జెడ్పీటీసీ స్థానాలకు కౌంటింగ్ ముగిసింది. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల కౌంటింగ్కు అర్ధరాత్రి పట్టొచ్చని పంచాయితీ రాజ్ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. పూర్తి స్థాయి ఫలితాల వెల్లడికి మరింత సమయం పడుతుందని వివరించారు. మడకశిర మండలంలో 1 ఎంపీటీసీకి సంబంధించి రీపోల్కు అవకాశం ఉందని చెప్పారు. దీనిపై ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటుందని గిరిజాశంకర్ పేర్కొన్నారు.
ఇదీ లెక్క..
మొత్తం 515 జడ్పీటీసీ స్థానాలకు 2,058 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాల్లో 2,371 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వివిధ కారణాల రీత్యా ఎన్నికల ప్రక్రియ 375 స్థానాల్లో నిలిచిపోయింది. పోటీ చేసిన వారిలో 81 మంది అభ్యర్థులు మరణించారు. మిగిలిన 7,220 స్థానాలకుగాను 18,782 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఏప్రిల్ 8న ఆయా స్థానాలకు జరిగిన పోలింగ్లో మొత్తం 1,29,55,980 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొవిడ్ జాగ్రత్తలతో 13 జిల్లాల్లో 209 కేంద్రాల్లో ఓట్లు లెక్కించారు.
జగన్ రియాక్షన్
ఇటు పరిషత్ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ స్పందించారు. దేవుడి దయ, మీ అందరి దీవెనల వల్లే ఇంతటి అఖండ విజయం సాధ్యమైందని తెలిపారు. ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలు రాష్ట్రంలోని ప్రతి కుటుంబం పట్ల, ప్రతి మనిషి పట్ల తన బాధ్యతను మరింత పెంచాయని పేర్కొన్నారు. సోమవారం ఉదయం కల్లా ఎంపీటీసీ, జడ్పీటీసీ పూర్తి ఫలితాలు వస్తాయని సీఎం జగన్ వెల్లడించారు. పూర్తి ఫలితాలు వచ్చాక మరోసారి అందరికీ వీడియో సందేశం ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటానని ట్వీట్ చేశారు.
సజ్జల కౌంటర్
ఇటు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా స్పందించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తమదే విజయం అని పేర్కొన్నారు. సీఎం జగన్ పాలనకు మరోసారి ప్రజల నుంచి ఆశీస్సులు అందాయని వెల్లడించారు. పేదల జీవితాల్లో కాంతులు నింపేందుకు సీఎం జగన్ చేస్తున్న కృషిని ప్రజలు శభాష్ అంటూ మెచ్చుకున్నారని, అందుకు తాజా ఫలితాల ప్రభంజనమే నిదర్శనమని పేర్కొన్నారు. కొన్ని పార్టీలకు ఈ ఫలితాలు గుణపాఠాలని కామెంట్ చేశారు. పరిషత్ ఎన్నికల ప్రక్రియ 2020లో ప్రారంభమై 2021లో ముగిసిందంటే అది చంద్రబాబు చలవేనని సజ్జల సెటైర్లు వేశారు.
Recommended Video
నిమ్మగడ్డపై ఫైర్
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ టీడీపీ కార్యకర్తగా పనిచేశాడని, చంద్రబాబు కోర్టులకు వెళ్లి ఇబ్బందులకు గురిచేశాడని ఆరోపించారు. అయినప్పటికీ ప్రజలు తమ పక్షానే ఉన్నారని, విశ్వసనీయత నచ్చితే ప్రజలు ఎలా పట్టం కడతారో మరోసారి స్పష్టమైందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ గాంభీర్యం ప్రదర్శిస్తోందని, దమ్ముంటే అసెంబ్లీ ఎన్నికలు పెట్టాలని అచ్చెన్నాయుడు అంటున్నాడని, గత ఎన్నికల్లో ఘోరంగా ఓడినా బుద్ధి రాలేదని సజ్జల విమర్శించారు.ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలను ఓసారి పరిశీలిస్తే... ఓట్లు లెక్కిస్తున్న మొత్తం ఎంపీటీసీ స్థానాలు 9589 కాగా, వైసీపీ 7,623 స్థానాలను చేజిక్కించుకుంది. టీడీపీ 848, జనసేన 119, బీజేపీ 32, ఇతరులు 198 స్థానాల్లో గెలిచారు. 641 జడ్పీటీసీ స్థానాలకు గాను వైసీపీ 530, టీడీపీ 6, ఇతరులు 2 స్థానాలు గెలిచారు. మిగిలిన స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.