లేఖాస్త్రం: సీఎం జగన్కు నారా లోకేశ్ లెటర్.. ఇదే అంశం..
పోలవరం నిర్వాసితుల హామీలపై సీఎం జగన్మోహన్ రెడ్డికి టీడీపీ నేత నారా లోకేష్ లేఖ రాశారు. జగన్ హామీలకు సంబంధించిన ఓ వీడియోను ఆ లేఖకు జత చేశారు. పోలవరం నిర్వాసితులకు ఎకరాకు రూ.19 లక్షలు చెల్లిస్తానని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీ గురించి ప్రస్తావించారు. మాట తప్పనని చేసుకునే ప్రచారానికి కట్టుబడి పోలవరం నిర్వాసితులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
275 ప్రభావిత గ్రామాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి, కేవలం 9 గ్రామాల్లో మాత్రమే అరకొరగా పరిహారం అందచేశారని నారా లోకేశ్ విమర్శించారు. వరదల్లో నిండామునిగిన నిర్వాసితులకు ఒక కొవ్వొత్తి, 2 బంగాళాదుంపలు ఇవ్వడం ఏంటీ అని పేర్కొన్నారు. నిర్వాసితులది చిన్న సమస్యే అంటున్న మంత్రులు ఆ దిశగా చిన్న ప్రయత్నం కూడా చేయకపోవటం సరికాదన్నారు. సమస్య పేరు చెప్పి.. చులకన చేయడం.. మంచి పద్దతి కాదన్నారు. ఎన్నికల సమయంలో జనం గుర్తొస్తారా అని లోకేశ్ అడిగారు.
వారికి ఉండేందుకు ఇళ్లు, తాగేందుకు నీళ్లు, విద్యుత్ సౌకర్యం వంటివి లేక నిర్వాసితులు సమస్యలతో సావాసం చేస్తుంటే ప్రభుత్వంలో స్పందన లేదని లోకేశ్ విమర్శించారు. పునరావాస కల్పనలో ప్రభుత్వం విఫలమైందని జాతీయ ఎస్టీ కమిషన్ ఆక్షేపించారని గుర్తుచేశారు. అయినా ప్రభుత్వంలో స్పందన లేకపోవడం విచారకరం అన్నారు. ఇకనైనా ప్రభుత్వం తీరు మారాలని కోరారు. ప్రజలు, వారి డెవలప్, సంక్షేమం గురించి పట్టించుకోవాలని సజెస్ట్ చేశారు. తమ చేతిలో అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం సరికాదన్నారు.
ఏపీ సర్కార్ చేస్తోన్న తప్పులను లోకేశ్ ఎండగడుతున్నారు. చెప్పడమే కానీ చేయడం లేదని అంటున్నారు. ఇటీవల వరసగా విమర్శలు చేస్తున్నారు. కౌంటర్ అటాక్ ఎక్కువ ఇస్తున్నారు. అందులో భాగంగా లేఖలు కూడా రాస్తున్నారు. ప్రజా సమస్యలపై నిరసన కూడా తెలియజేస్తున్నారు. వచ్చే ఎన్నికల కోసమే ఏమో కానీ.. లోకేశ్ యాక్టివ్గా ఉంటున్నారు. సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా కూడా స్పందిస్తున్నారు. ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎండగడుతూ.. ముందడుగు వేస్తున్నారు.