మేనిఫెస్టోపై వివరణ ఇవ్వండి.. టీడీపీకి ఎస్ఈసీ నిమ్మగడ్డ నోటీసులు
ఏపీ పంచాయతీ పోరు రంజుమీదుంది. టీడీపీ- వైసీపీ- ఎస్ఈసీ మధ్య కామెంట్ల జడి వాన కురుస్తోంది. అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం జగన్ సర్కార్ ససేమిరా నో అన్న సంగతి తెలిసిందే. అయిష్టంగానే అంగీకరించాల్సి వచ్చింది. ప్రతిపక్ష టీడీపీ మాత్రం దూకుడుగా ఉంది. మేనిఫెస్టో కూడా విడుదల చేసింది. వాస్తవానికి సర్పంచ్ పదవీకి పరోక్ష పద్దతిలో.. పార్టీలకు, అభ్యర్థులతో సంబంధం ఉండదు. దీనికి మేనిఫెస్టో విడుదల చేయడం వివాదం రేపింది. దీనిపై అధికార వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం చివరికి స్పందించింది.
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో విడుదల చేసిన విషయం తెలిసిందే. పల్లె ప్రగతి-పంచ సూత్రాల పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు. దీనిపై ఇప్పటికే ఎస్ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చేయడం సరికాదని కామెంట్ చేసింది. టీడీపీ మేనిఫెస్టో విడుదలపై ఆ పార్టీ వివరణ ఇవ్వాలని ఎస్ఈసీ టీడీపీకి నోటీసులు జారీచేసింది. వచ్చేనెల 2వ తేదీలోపు వివరణ ఇవ్వాలని తెలిపింది. పార్టీలకు అతీతంగా జరిగే స్థానిక ఎన్నికలలో మేనిఫెస్టో సరైనది కాదని ఎస్ఈసీ స్పష్టంచేశారు.
ఇవాళ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాయలసీమలో పర్యటించారు. కడప టూర్ సందర్భంగా దివంగత వైఎస్ఆర్ను ప్రశంసలతో ముంచెత్తారు. ఆయన ఆశీస్సులతోనే తాను ఈ స్థానంలో ఉన్నానని చెప్పారు. దీంతో వైసీపీ నేతల విమర్శలకు తనదైన శైలిలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చెక్ పెట్టారని అర్థమవుతోంది. వైఎస్ఆర్ పేరు జపించి.. నేతల నుంచి కొంత విమర్శలను తగ్గించుకోగలిగారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్.