తాడిపత్రిలో జేసీ వర్సెస్ పెద్దారెడ్డి: ఒకే వార్డు నుండి ఇద్దరూ పోటీ: ఏం జరుగుతోంది...!
వర్గ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే తాడిపత్రి మరోసారి వార్తల్లో నిలిచింది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఇదే నియోజకవర్గ పరిధిలో హింస చోటు చేసుకుంది. అయితే, అవే ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ కు పెట్టని కోటగా ఉన్న తాడిపత్రిలో ఎదురు దెబ్బ తగిలింది. అనంతపురం ఎంపీగా..తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీ చేసిన జేసీ వారసులు ఓడిపోయారు. ఇక, ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సులను వెంటాడుతున్నారని..తమ ఆర్దిక మూలాలు దెబ్బ తీస్తున్నారంటూ జేసీ దివాకర్ రెడ్డి పదే పదే ఆరోపిస్తున్నారు. ఇక, ఇదే సమయంలో జగన్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్లతో ఇక పోటీ చేయటం కష్టమని..తాము తమ అభ్యర్ధులను పోటీలో పెట్టమని ప్రకటించి సంచలనానికి కారణమయ్యారు. అయితే, ఇప్పుడు మాత్రం జేసీ దివాకర్ రెడ్డి చేసిన ప్రకటనకు భిన్నంగా ఒకరు వార్డు కౌన్సిలర్ గా నామినేషన్ దాఖలు చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది.

పెద్దారెడ్డి వర్సెస్ జేసీ...
ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో తాడిపత్రి మున్సిపాల్టీ అన్ రిజర్వ్ కావటంతో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి తమ వారసుడిని రంగంలోకి దింపారు. తాడిపత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్ద కుమారుడు హర్షవర్ధన్ ఇప్పటికే 30వ వార్దు నుండి నామినేషన్ దాఖలు చేశారు. గెలిస్తే మున్సిపల్ ఛైర్మన్ గా అయ్యే అవకాశం ఉండటంతో గెలుపు కోసం శ్రమిస్తున్నారు.

కౌన్సిలర్గా నామినేషన్ దాఖలు చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి
జేసీ దివాకర్ రెడ్డి ప్రకటన తో ఇక తాడిపత్రిలో టీడీపీ నుండీ జేసీ కుటంబీకులు..అనుచరులు పోటీలో ఉండరని భావించారు. కానీ, పెద్దారెడ్డి కుమారుడు పోటీలో ఉండటంతో ఈ రోజు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ సభ్యుడిగా పని చేసిన ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. తాడిపత్రి మున్సిపాలీటీ 30వ వార్డుకు కౌన్సిలర్గా నామినేషన్ వేశారు. జేసీ ప్రభాకర్రెడ్డి తరపున ఆయన న్యాయవాదులు నామినేషన్ దాఖలు చేశారు.

న్సిలర్ గా పని చేస్తారా...
తాడిపత్రిలో ఉన్న ఇప్పటి పరిస్థితుల్లో వైసీపీ ఆధిపత్యం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో గతంలో మున్సిపల్ ఛైర్మన్ గా ..తాడిపత్రి ఎమ్మెల్యేగా పని చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు కౌన్సిలర్ గా నామినేషన్ దాఖలు చేయటం సంచలనంగా మారింది. తన పైన ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దారెడ్డి కుటుంబం నుండి మరెవరూ ఏ ఎన్నికల్లోనూ గెలవకూడదని..అదే సమయంలో తాడిపత్రిలో తమ బలం చాటుకోవటం కోసమే ఈ నామినేషన్ దాఖలు చేయించినట్లుగా తెలుస్తోంది.

మాట తప్పిన దివాకర్ రెడ్డి
దివాకర్ రెడ్డి చెప్పిన దానికి భిన్నంగా ప్రభాకర రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవటం ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. తమ న్యాయవాదుల ద్వారా నామినేషన్ దాఖలు చేయించిన ప్రభాకర రెడ్డి తుది పోటీలో నిలుస్తారా..లేక నామినేషన్ ఉపసంహరించుకుంటారా అనేది సైతం చర్చ సాగుతోంది. ప్రభాకర రెడ్డి తాజా అడుగుల మీద ఆయన సోదరుడు దివాకర రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications