ప్రారంభం.. ప్రమాదం: కొత్త అంబులెన్సులు ధ్వంసం: విజయవాడ బందర్ రోడ్డులో: ఒకదాని వెంట ఒకటి
విజయవాడ: కొత్తగా అందుబాటులోకి వచ్చిన అంబులెన్సులో ప్రమాదానికి గురయ్యాయి. ఒకదాని వెంట ఒకటి ఢీ కొట్టుకోవడంతో.. అవి పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. విజయవాడలోని బందరు రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. బుధవారం ఉదయం విజయవాడ బెంజ్ సర్కిల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన 108, 104 అంబులెన్సులు మచిలీపట్నం వైపు వెళ్తూ ప్రమాదానికి గురయ్యాయి.
బెంజ్ సర్కిల్లో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి వైఎస్ జగన్ జెండా ఊపి ప్రారంభించారు. ఆ వాహనాలన్నీ నిర్దేషిత షెడ్యూల్ ప్రకారం.. జిల్లాలకు బయలుదేరి వెళ్లాయి. సుమారు 70కి పైగా 108, 104 అంబులెన్సు వాహనాలు మచిలీపట్నం వైపునకు బయలుదేరాయి. గడువు ప్రకారం.. అవి మధ్యాహ్నానికి మచిలీపట్నానికి చేరుకోవాల్సి ఉంది. బెంజ్ సర్కిల్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే అందులో మూడు అంబులెన్సులు ప్రమాదానికి గురయ్యాయి.

బందర్ రోడ్డు మీదుగా వెళ్తోన్న సమయంలో ఓ అంబులెన్స్ డ్రైవర్ సడన్గా బ్రేక్ వేశాడు. ఫలితంగా.. దాని వెనుకే వస్తోన్న మరో అంబులెన్స్ దాన్ని వెనుక వైపు నుంచి ఢీ కొట్టింది. అదే సమయంలో మరో అంబులెన్స్ కూడా రెండో వాహనాన్ని వేగంగా ఢీ కొట్టింది. ఫలితంగా ఈ మూడూ పాక్షికంగా దెబ్బతిన్నాయి. వాటి ముందు, వెనుక భాగాలు ధ్వంసం అయ్యాయి. దీనితో కొద్దిసేపు బందరు రోడ్డులో వాహనాల రాకపోకలు స్తంభించాయి.
సమాచారం అందుకున్న వెంటనే ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు వాహనాలను టోయింగ్ చేశారు. రోడ్డు పక్కకు తీసుకెళ్లారు. వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ మూడింటినీ వెంటనే మరమ్మతులను చేపట్టి.. వాటి గమ్యస్థానాలకు పంపిస్తామని అధికారులు తెలిపారు. ముందు వెళ్తోన్న అంబులెన్స్ డ్రైవర్ సడన్గా బ్రేక్ వేయడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని, వాహనాల్లో సాకేంతిక ఇబ్బందులేవీ లేవని చెప్పారు.
Recommended Video
ఈ ఉదయం బెంజ్ సర్కిల్లో వైఎస్ జగన్ మొత్తం 1088 అంబులెన్స్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications