ఏపీఎస్ఆర్టీసీలో కరోనా విలయతాండవం: 1187 మందికి వైరస్, 18 మంది మృతి..
ప్రగతి రథ చక్రాల సిబ్బందిని కరోనా వైరస్ కలవరానికి గురిచేస్తోంది. వైరస్ సమూలంగా తగ్గే అవకాశం లేకపోవడంతో ఆర్టీ బస్సు సేవలను స్టార్ట్ చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ సిబ్బందిని కరోనా వైరస్ కబలిస్తోంది. ఈ నెల 2వ తేదీ వరకు 1187 మందికి కరోనా వైరస్ సోకిందనే కఠోర వాస్తవాన్ని ఉన్నతాధికారులు ధృవీకరించారు. 18 మంది మృతిచెందారని అధికారులు చెబుతున్నారు. కానీ ఆ సంఖ్య ఎక్కువే ఉంటుందని కార్మికులు అంటున్నారు. 20 మంది వరకు చనిపోయారని తెలిపారు.
సమస్యలు ఇవీ..
ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యే సమయంలోనే ఈయూ, ఎన్ఎంయూ, ఎస్డబ్ల్యూఎఫ్ కార్మిక సంఘాలు యాజమాన్యానికి, ప్రభుత్వానికి సమస్యలపై వినతిపత్రం అందజేశాయి. సిబ్బందికి కరోనా సోకితే.. మెరుగైన వైద్యం అందించాలని కోరాయి. విధుల్లో ఉండగా కరోనా వచ్చి చనిపోతే రూ. 50 లక్షల బీమా వర్తింపజేయాలని విన్నవించాయి. దీనికి అనుగుణంగా గతనెల 15వ తేదీన అన్ని డిపో మేనేజర్లు, ఆర్ఎం, ఈడీలకు యాజమాన్యం సర్క్యులర్ జారీచేసింది.
ఐసోలేషన్కు మూడున్నర వేలు..
పీటీడీ సిబ్బందికి కరోనా వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ఎంపిక చేసిన రెఫరల్ ఆసుపత్రుల్లో వైద్యం అందించాలని కూడా ఆదేశించింది. ఐసోలేషన్కు మూడున్నర వేలు, వెంటిలేటర్తో సహా చేసే ట్రీట్మెంట్కు పదిన్నర వేలు నిర్ణయించింది. నిధులు డ్రా చేసి అధికారం డిపో మేనేజర్లకు ఇచ్చింది. రాష్ట్రంలో ఏ రెఫరల్ ఆసుపత్రికి వెళ్లినా బెడ్లు లేవు. క్వారంటైన్ కేంద్రాలకు వెళదామంటే ఇంట్లోనే జాగ్రత్తలు తీసుకోండని వారు సజెస్ట్ చేస్తున్నారు.
Recommended Video
ఇంట్లోకి రానీయని యజమానులు..
అక్కడ అలా ఉంటే ఇంటికి వద్దామనుకుంటే కూడా ఇబ్బందులు వస్తున్నాయి. చాలా మంది సిబ్బందికి సొంత ఇల్లు లేవు. కిరాయికి ఉండటంతో కరోనా వస్తే.. యాజమానులు రానీయని పరిస్థితి నెలకొంది. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉద్యోగులు ఉన్నారు. అయితే రాష్ట్రంలో ఆర్టీసీకి రెండు ఆస్పత్రులు ఉన్నాయి. తమకు ఆస్పత్రిలో చికిత్స అందించలేని పరిస్థితి ఉన్నందున.. వాటిని కోవిడ్ కేంద్రాలుగా మార్చాలని సిబ్బంది కోరుతున్నారు. దీంతోపాటు మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల బీమా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.