ఏపీలో స్వల్పంగానే కరోనా కేసులు: విజయనగరంలో తక్కువ, ప.గోలో ఎక్కువ, 90లక్షలు దాటిని
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్నివారాలుగా కరోనా కొత్త కేసులు స్వల్పంగానే నమోదవుతున్నాయి. కరోనా పరీక్షలు తగ్గించనప్పటికీ కరోనా కేసులు మాత్రం భారీగా పెరగడం లేదు. మరణాల సంఖ్య కూడా బాగా తగ్గుతూ వస్తోంది. అదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా, కరోనా పరీక్షల సంఖ్య 90 లక్షలు దాటడం గమనార్హం.
Recommended Video
ఏపీలో కొత్తగా 1593 కరోనా పాజిటివ్ కేసులు
ఏపీలో గత 24 గంటల్లో 80,737 కరోనా పరీక్షలను నిర్వహించగా, 1593 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,51,298కి చేరింది. ఇక ఒక్కరోజు వ్యవధిలో 10 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6847కి చేరింది.
ఏపీలో 20వేల యాక్టివ్ కేసులు
గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.గడిచిన 24 గంటల్లో 2178 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8,24,189కు చేరింది. ప్రస్తుతం రాస్ట్రంలో 20,262 యాక్టివ్ కేసులున్నాయి.
ఏపీలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులు
ఏపీ జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 105, చిత్తూరులో 225, తూర్పుగోదావరిలో 259, గుంటూరులో 202, కడపలో 43, కృష్ణాలో 202, కర్నూలులో 45, నెల్లూరులో 93, ప్రకాశంలో 51, శ్రీకాకుళంలో 58, విశాఖపట్నంలో 80, విజయనగరంలో 42, పశ్చిమగోదావరి జిల్లాలో 188 కేసులున్నాయి.
దేశంలో 5 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు
ఇక దేశ వ్యాప్తంగానూ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో కొత్తగా 44వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, 49వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే కోలుకున్నవారే ఎక్కువగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 92.97 శాతానికి చేరుకుందని, ఇప్పటి వరకు 81 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 5 లక్షలకు దిగువకు యాక్టివ్ కేసులు చేరుకోవడం గమనార్హం.