ఏపీలో కొత్తగా 19 పాజిటివ్ కేసులు: 500 మార్క్ను దాటేశాయి: కరోనా వల్ల ఇద్దరి మృతి
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల పెరుగుదలకు బ్రేక్ పడట్లేదు. ప్రతిరోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. లాక్డౌన్ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వాటిని నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలకు సవాల్ విసురుతున్నాయి. కొత్తగా 19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ నోడల్ అధికారి వెల్లడించారు.
Recommended Video
మంగళవారం రాత్రి 9 నుంచి ఈ ఉదయం 9 గంటల వరకు కరోనా వైరస్ ల్యాబొరేటరీల్లో నిర్వహించిన పరీక్షలను నిర్వహించగా.. 19 కేసులు నమోదు అయ్యాయని నోడల్ అధికారి తెలిపారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా ఎనిమిది.. పశ్చిమ గోదావరి జిల్లాల్లో నమోదు అయ్యాయి. కర్నూలు-6 గుంటూరు-4, కృష్ణాజిల్లాలో ఒకటి పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. గుంటూరు జిల్లాలో రెండు కరోనా వైరస్ మరణాలు నమోదు అయ్యాయి.
గుంటూరు జిల్లాకు చెందిన పేషెంట్ నంబర్ 336, పేషెంట్ 265 మరణించినట్లు నోడల్ అధికారి వెల్లడించారు. 63 సంవత్సరాల వయస్సున్న పేషెంట్ నంబర్ 336కు డయాబెటిక్ సమస్యలు కూడా ఉన్నాయని అన్నారు. పేషెంట్ నంబర్ 265కు డయాబెటిక్, ఊపిరితిత్తుల్లో ఇబ్బందులు ఉండేవని చెప్పారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 11కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 16 మంది పూర్తిగా కోలుకుని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయినట్లు వెల్లడించారు.
జిల్లాలవారీగా అనంతపురం-20, చిత్తూరు-23, తూర్పు గోదావరి-17, గుంటూరు-118, కడప-33, కృష్ణా-45, కర్నూలు-97, నెల్లూరు-56, ప్రకాశం-42, విశాఖపట్నం-20, పశ్చిమ గోదావరి-31 కేసులు నమోదు అయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటిదాకా ఒక్క కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కూడా నమోదు కాలేదు. కరోనా వైరస్ పరీక్షలు ఇంకా కొనసాగుతున్నందున మరిన్ని పాజిటివ్ కేసులు నమోదు అయ్యే అవకాశాలు లేకపోలేదని అధికారులు చెబుతున్నారు.