పాక్ చెరలోని 20 మంది మత్స్యకారుల విడుదల: వాఘా సరిహద్దుకు ఏపీ మంత్రి
Recommended Video
న్యూఢిల్లీ: పాకిస్థాన్ చెరలో ఉన్న 20 మంది తెలుగు మత్స్యకారులను ఆ దేశం విడుదల చేసింది. కరాచీ జైలులో ఉన్న జాలర్లను సోమవారం వాఘా సరిహద్దు వద్ద భారత అధికారులకు అప్పగించనున్నారు. ఇప్పటికే వారిని ప్రత్యేక వాహనంలో తరలించారు.
పాకిస్థాన్ జైల్లో ఉన్న తెలుగు మత్స్యకారులను విడుదల చేసేందుకు అంగీకరించిన పాకిస్థాన్.. జనవరి 4న భారత విదేశాంగ శాఖకు సమాచారం అందించింది. తాము విడుదల చేయబోతున్న మత్స్యకారుల జాబితాను కూడా పాకిస్థాన్ ప్రభుత్వం భారత విదేశాంగ శాఖకు పంపించింది.
బతుకుదెరువు కోసం గుజరాత్కు వలస వెళ్లిన మత్స్యకారులు 2018, డిసెంబర్ లో అనుకోకుండా పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో పాకిస్థాన్ సైన్యం వారిని అదుపులోకి తీసుకొని బంధించింది.
వాఘా సరిహద్దుకు ఏపీ మంత్రి
పాకిస్థాన్ చెరలో ఉన్న తెలుగు మత్స్యకారులను విడుదల చేస్తున్న నేపథ్యంలో వారిని వాఘా సరిహద్దు వద్ద కలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ, అధికారులతో కలిసి వెళ్లారు. తెలుగు మత్స్యకారులను కలుసుకుని వారిని రాష్ట్రానికి తీసుకుని రానున్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలుమార్లు తెలుగు మత్స్యకారుల విడుదల గురించి కేంద్రానికి లేఖలు రాశారని, ఈ నేపథ్యంలోనే కేంద్రం పాకిస్థాన్ తో సంప్రదింపులు జరిపి వారిని విడుదలయ్యేలా చేసిందని మంత్రి మోపిదేవి తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన మత్స్యకారులు సోమవారం పాక్ చెర నుంచి విడుదలవుతున్నారని చెప్పారు.