బాబు బయటకు, మోడీకి గడ్డుకాలం, నిజస్వరూపం బయటపడింది: శివసేన
అమరావతి/న్యూఢిల్లీ: ఎన్డీయేలో బీజేపీకి ప్రధాన భాగస్వామ్య పక్షాల్లో ఒకటైన తెలుగుదేశం పార్టీ కేంద్ర కేబినెట్ నుంచి తన మంత్రులను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించడంపై మరో భాగస్వామ్య పార్టీ శివసేన స్పందించింది.
బాబు యూటర్న్ వెనుక... మీకోసమే 21న అవిశ్వాసం, జైట్లీ అబద్దం చెప్పలేదు: జగన్
ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు బీజేపీపై తీవ్ర విమర్శలు చేసారు. ఈ పరిణామాన్ని తాము ముందే ఊహించామని, ఎన్డీయే నుంచి ఇతర పార్టీలు కూడా బయటకు వస్తాయని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ అన్నారు.
మోడీకి గడ్డుకాలం
భాగస్వామ్య పక్షాలతో ఎలా ఉండాలో బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోడీకి తెలియడం లేదని సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు. కూటమి నుంచి ఒక్కో పార్టీ వైదొలుగుతూ ఉంటే మోడీకి గడ్డుకాలమేనని హెచ్చరికలు జారీ చేశారు.
టీడీపీ బయటకు రావడంతో బీజేపీ నిజస్వరూపం బట్టబయలు
శివసేన ఎంపీ అరవంద్ సావంత్ మాట్లాడుతూ.. మిత్రపక్షాలను గౌరవించడం బీజేపీ పెద్దలకు తెలియడం లేదని మండిపడ్డారు. ఈ విషయం టీడీపీ అందరికన్నా ముందుగానే గ్రహించిందన్నారు. సబ్ కా సాథ్ అని చెప్పే బీజేపీ ఆ పని మాత్రం చేయకుండా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటు వెళ్తోందన్నారు. టీడీపీ నిర్ణయంతో బీజేపీ నిజ స్వరూపం మరోసారి తేలిందన్నారు.
బీజేపీ పునరాలోచన చేయాలి
టీడీపీ కంటే ముందే తమ పార్టీ అధినేత ఉద్దవ్ థాకరే బీజేపీతో దోస్తీ గురించి తేల్చి చెప్పారని శివసేన నాయకురాలు మనీషా అన్నారు. టీడీపీ కేంద్రమంత్రులు ఇద్దరు రాజీనామా చేస్తున్నారని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పునరాలోచన చేయాలన్నారు.
ఓవర్ కాన్ఫిడెన్స్, 2019 సవాల్
గతంలో బీజేపీ పెద్దలు ఎన్డీయేను ఒక్కటిగా ఉంచేవారని వాజపేయీ, అద్వానీలను ఉద్దేశించి మనీషా అన్నారు. కానీ ఇప్పుడు వారికి అతివిశ్వాసం పెరిగిందని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో 2019 బీజేపీకి పెద్ద సవాల్ అని ఆమె అన్నారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. అరుణ్ జైట్లీ ప్రకటనతో తాము ఈ నిర్ణయానికి వచ్చామని చెప్పారు. తాము ఏపీ ప్రయోజనాల కోసం పోరాడుతున్నామని, బీజేపీ-టీడీపీ మధ్య యుద్ధం కాదన్నారు.