ఏపీలో ఇక 26 జిల్లాలు: ప్రతిపాదనలు సిద్ధం, మంత్రివర్గ ఆమోదం, ఉగాదిలోపే
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. కొత్త జిల్లాల ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం కూడా తీసుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటు వివరాలను మంత్రులకు ఆన్లైన్లో పంపి వారి ఆమోదం తీసుకుంది.
ఏపీలో ఇక 26 జిల్లాలు
కాగా, 26 జిల్లాల ప్రతిపాదనల నివేదికను ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్కుమార్... సీఎస్కు అందించారు. దీంతో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఉగాదిలోపు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తిచేసి కొత్త జిల్లాలను అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటుచేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికలకు ముందు తమ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయం తెలిసిందే.
ఉగాదిలోపే రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు
అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై సుదీర్ఘ కసరత్తు జరిపారు. ఈలోపు 2021 జనాభా గణన ముందుకురావడంతో పునర్వ్యవస్థీకరణ ఆలస్యమైంది. కానీ, కరోనా నేపథ్యంలో జనాభా గణన ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో అది మొదలయ్యేలోపు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 25 లోక్సభ నియోజకవర్గాలుండగా.. ఇప్పుడున్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలు ఏర్పడనున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 26కు పెరగనుంది. అరకు పార్లమెంట్ సెగ్మెంట్ భౌగోళిక రిత్యా చాలా విస్తారమైనది కావడంతో.. ఆ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
సమస్యల్లేకుండా కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు
జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియపై ప్రభుత్వం శాస్త్రీయంగా అధ్యయనం చేసింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన అధ్యయన కమిటీని నియమించింది. వివిధ అంశాలపై పలు శాఖల అధికారులతో నాలుగు సబ్ కమిటీలను, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటుచేసింది. ఈ కమిటీల్లోని అధికారులు పలుమార్లు సమావేశమై జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఎలా ఉండాలి? సరిహద్దుల నిర్ధారణకు ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అంశాలేవి? దీనివల్ల ఎదురయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఏ విధానం పాటించాలి? వంటి అనేక అంశాలపై కూలంకుషంగా చర్చించి మార్గదర్శకాలు రూపొందించారు. మరోవైపు, ఏపీ సీఎస్ సమీర్ శర్మ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, కొత్త జిల్లాల ఏర్పాటుపై అభిప్రాయాలు చెప్పాలని కోరారు.