40 ఏళ్ల నివాసం.!ఉన్నపలంగా ఖాళీ చేయమంటే ఎలా?తాడేపల్లి నివాసితులపై సీఎంకు లోకేష్ లేఖ.!
అమరావతి/హైదరాబాద్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాసారు. తాడేపల్లి రైల్వేస్థలాల్లో నివాసితులకి ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీ మేరకు వేరేచోట ఇళ్లు కట్టి తరలించేవరకూ, రైల్వే అధికారులు ఇళ్లు కూల్చకుండా సమయం ఇచ్చేలా సీఎం తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లోకేష్ లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో పాటు రైల్వే డివిజన్ మేనేజర్ కు కూడా నిర్వాసితుల ప్రత్యామ్నాయ స్థల ఏర్పాటుపై లేఖ రాసారు నారా లోకేష్.
నలభై ఏళ్లుగా నివాసం..
ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఉన్న ప్రాంతమైన తాడేపల్లి ఆరు, పద్నాలుగు, పదిహేను, పదహారు వార్డుల పరిధి రైల్వే స్థలాల్లో నలభై ఏళ్లుగా ఇళ్లు కట్టుకుని నివసిస్తున్న అట్టడుగువర్గాలకి చెందిన నిరుపేదలను ఒక్కరోజులో ఇళ్లు ఖాళీ చేయాలని రైల్వే అధికారులు నోటీసులు ఇచ్చారని, ఇది అత్యంత దారుణమని లోకేష్ సీఎం కు రాసిన లేఖలో తెలిపారు. దీనిపై సీఎం జగన్మోహన్ రెడ్డి అత్యవసరంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు లోకేష్. ఈ అంశం రాజకీయ పార్టీగా తమరి బాధ్యత అని లోకేష్ లేఖలో గుర్తు చేసారు.
రైల్వేస్థలంలోని పేదలకు పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని వైసీపి హామీ..
2019 ఎన్నికల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, వైసీపి నాయకులు ఈ రైల్వేస్థలంలో వున్న పేదలకు పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చి ఉన్నారనే అంశాన్ని లోకేష్ గుర్తు చేసారు. గతంలోనూ ఈ సమస్య తలెత్తినప్పుడు రైల్వే అధికారులకు టీడిపీ పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ లేఖరాసి సమస్యని వివరించి గడువు తీసుకున్నారని తెలిపారు. వైసీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పేదలకిచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో రైల్వే అధికారులు 22వ తేదీలోగా ఇళ్లు ఖాళీ చేయాలని, లేదంటే తామే కూల్చేస్తామని తెలియజేయడంతో నిరుపేదలంతా తీవ్ర ఆందోళనలో వున్నారని లోకేష్ తెలిపారు.
అందరూ రోజూవారీ కూలీలే..
కూలికెళితేకానీ కూడు దొరకని నిరుపేదలైన ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు చెందిన 650 కుటుంబాల సమస్యని తమరి దృష్టికి తీసుకొస్తున్నానని లోకేష్ సీఎం జగన్ కు వివరించారు. కరోనా థర్డ్ వేవ్ తీవ్రంగా వున్న దశలో, ఎముకలు కొరికే చలికాలం, మరోవైపు కూలి పనులు లేని సంక్షోభ సమయంలో రాత్రికి రాత్రి పేదల్ని ఇళ్లు ఖాళీ చేయాలని రైల్వే అధికారులు ఆదేశిస్తే, వారు ఎక్కడికి వెళ్లగలరు? ఈ పేదలకు న్యాయం చేయాలంటూ పార్టీలకు అతీతంగా తాడేపల్లి రాజకీయ నేతలు ముక్తకంఠంతో కోరుతున్నారన్నారు నారా లోకేష్.
సీఎం హోదాలో స్పందించండి..
ఈ సమస్యని అత్యంత ముఖ్యమైనదిగా భావించి ముఖ్యమంత్రి హోదాలో రైల్వే అధికారులతో మాట్లాడాలని, ప్రభుత్వం తరఫున ఇచ్చిన హామీ మేరకు 650 మందికి వేరే చోట ఇళ్లు కట్టి తరలించేవరకూ ఇక్కడే నివాసం వుండేలా రైల్వే అధికారులని ఒప్పించాల్సిన బాధ్యత వైసిపి ఎమ్మెల్యేపై ఉందన్నారు. ఎన్నికల హామీలో భాగంగా నిరుపేదలకు వేరే ప్రాంతంలో ఇళ్లు కట్టి ఇస్తామని మీ వైసీపీ స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన హామీని నెరవేర్చాలని, లేదంటే ప్రత్యామ్నాయం దొరికే వరకూ ఇళ్లు ఖాళీ చేయకుండా గడువు తీసుకోవాలని లోకేష్ పేదల తరుపున సీఎం కు విజ్ఞప్తి చేసారు.
మానవత్వంతో ఆలోచించండి..
అంతే కాకుండా విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ కి కూడా నారా లోకేష్ లేఖ రాసారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మున్సిపాలిటీలోని 6, 14, 15, 16 వార్డు పరిధిలోని రైల్వే భూముల్లో సుమారుగా 650 కుటుంబాలు దాదాపు 40 ఏళ్లుగా ఇక్కడే వుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన వీరందరికీ ఉన్నట్టుండి రైల్వే అధికారులు జనవరి 22 లోపు ఇళ్లు ఖాళీ చెయ్యాలని నోటీసులు ఇవ్వడంతో అక్కడ నివసిస్తున్న పేద ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొందని రైల్వే డివిజనల్ మేనేజర్ కి గుర్తు చేసారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించి పక్కా ఇళ్లు నిర్మించే వరకూ తాడేపల్లి రైల్వే స్థలంలో నివాసితులకు మానవతా దృక్పథంతో అక్కడే వుండే అవకాశం ఇవ్వాలని రైల్వే డివిజనల్ మేనేజర్ కి లోకేష్ విజ్ఞప్తి చేసారు.