ఏపీలో కరోనా: 6వేలకు చేరువలో కొత్త కేసులు, చిత్తూరులోనే వెయ్యికిపైగా, 50వేలకు దగ్గరగా యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు మరింతగా విజృంభిస్తోంది. ఒక్క రోజు వ్యవధిలోనే 6వేలకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 37,765 నమూనాలను పరీక్షించగా.. 5963 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం సాయంత్రం వెల్లడించింది.
ఏపీలో కొత్తగా 6వేలకు చేరువలో కరోనా కేసులు, 27 మరణాలు
తాజాగా నమోదైన 5963 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,68,000కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 27 మంది మృతి చెందారు. ఒక్క రోజు వ్యవధిలో కృష్ణా జిల్లాలో ఆరుగురు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నలుగురు చొప్పున, గుంటూరు, కడప, కర్నూలు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాలు ఇద్దరు చొప్పున, అనంతపురం జిల్లాలో ఒకరు కరోనాతో మరణించారు.
ఏపీలో భారీగా పెరుగుతున్న యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 2569 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 9,12,510కి చేరింది. కోలుకుంటున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల్లో భారీ పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 48,053 యాక్టివ్ కేసులున్నాయి.
చిత్తూరు, కర్నూలు, గుంటూరు జిల్లాలో కరోనా కల్లోలం
ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,57,15,757 కరోనా నమూనాలను పరీక్షించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1182, గుంటూరు జిల్లాలో 938 కరోనా కేసులు నమోదు కాగా, అల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 19 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలోనే పశ్చిమగోదావరి, విజయనగరం జిల్లా మినహా 8 జిల్లాల్లో 200కిపైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అన్ని జిల్లాల్లోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నప్పటికీ.. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలో మాత్రం కేసులు తక్కువగా నమోదవుతుండటం గమనార్హం.
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురంలో 156, చిత్తూరులో 1182, తూర్పుగోదావరిలో 626, గుంటూరులో 938, కడపలో 189, కృష్ణాలో 171, కర్నూలులో 434, నెల్లూరులో 491, ప్రకాశంలో 280, శ్రీకాకుళంలో 893, విశాఖపట్నంలో 565, విజయనగరంలో 19, పశ్చిమగోదావరిలో 19 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా కరోనా నిబంధనలను పాటించాలని ప్రభుత్వం కోరుతోంది. బయటికి వెళ్లినప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేసింది. కాగా, రాష్ట్రంలో భారీ ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించాలని ఏపీ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు ఆంక్షలను అమలు చేయాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
Recommended Video