కారణం అదేనా?: జగన్ ఢిల్లీ పర్యనటకు డుమ్మా కొట్టిన 8 మంది ఎమ్మెల్యేలు వీరే!
అమరావతి: ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్'కు ఎలా బ్రేకులు వేయాలో తెలియక వైసీపీ అధినేత వైయస్ జగన్ నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో చంద్రబాబు తెరలేపిన వలసల గురించి జాతీయ నాయకుల వద్ద ఆందోళన వెలిబుచ్చుదామని ఆయన చేపట్టిన ఢిల్లీ యాత్ర సత్ఫలితాలిస్తుందో?... లేదో? తెలియదు కానీ, ఆరంభంలోనే ఆయనకు గట్టి షాకిచ్చింది.
అధికార టీడీపీ అడ్డగోలుగా సంపాదించిన అవినీతి సొమ్ముతో వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న తీరును నిరసిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించమని నినదిస్తూ.. వైసీపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే.
అయితే జగన్ పిలుపు మేరకు సోమవారం ఢిల్లీ వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేల్లో ఏకంగా 8 మంది ఎమ్మెల్యేలు కనిపించక పోవడం విశేషం. టీడీపీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్'లో భాగంగా 13 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరారు. దీంతో 44 మంది ఎమ్మెల్యేలు జగన్ వెంట విమానం ఎక్కగా, 8 మంది ఎమ్మెల్యేల విమానంలో కనిపించలేదు.
వీరిలో కిడారి సర్వేశ్వరరావు (అరకు), గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి), బుడ్డా రాజశేఖరరెడ్డి (శ్రీశైలం), పోతుల రామారావు (కందుకూరు), అమర్ నాథ్ రెడ్డి (పలమనేరు), శ్రీకాంత్ రెడ్డి(రాయచోటి), రామచంద్రారెడ్డి (పీలేరు), చెవిరెడ్డి భాస్కరరెడ్డి (చంద్రగిరి) ఉన్నారు.
కాగా అమర్నాథ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రామచంద్రారెడ్డిలు విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా ఈ బృందంలో లేరు. ఇక రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా ఇందులో కనిపించలేదు. తన తాత మరణంతో సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి తిరుపతి వచ్చిన చెవిరెడ్డి తిరిగి రాత్రికి ఢిల్లీ చేరుకుంటారని తెలుస్తోంది.

ఇక సర్వేశ్వరరావు, గొట్టిపాటి రవికుమార్, బుడ్డా రాజశేఖరరెడ్డి, పోతుల రామారావు కనపించకపోవడంతో వైసీపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. సర్వేశ్వరరావు, గొట్టిపాటి రవికుమార్, బుడ్డా రాజశేఖరరెడ్డి ముగ్గురు కూడా త్వరలో టీడీపీలోకి చేరనున్న నేపథ్యంలో వీరి ఢిల్లీ బృందంలో కనిపించలేదని అటు వైసీపీతోపాటు టీడీపీ వర్గాల అంచనా.
అయితే పోతుల రామారావు కనిపించకపోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. పోతుల రామారావు కూడా వైసీపీ పార్టీని వీడే క్రమంలోనే ఢిల్లీకి రాలేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోతులపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
జగన్ బృందం ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం హోం మంత్రి రాజ్నాథ్సింగ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జేడీయూ నేత శరద్యాదవ్తో భేటీ కానున్నారు. అపాయింట్మెంట్ల ఇంకా ఖరారు కాలేదు కాబట్టి రెండు, మూడు రోజులు ఢిల్లీలోనే ఉంటారని వైసీపీ వర్గాల సమాచారం.












Click it and Unblock the Notifications