గుడ్న్యూస్: 8 వేల పై చిలుకు కొలువులు, త్వరపడండి...
సర్కార్ కొలువు కోసం ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు సర్కార్ తీపికబురు అందించింది. ఖాళీలను భర్తీ చేస్తామని స్పష్టంచేసింది. 8402 సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఏపీ సర్కార్ స్పష్టంచేసింది. పంచాయతీరాజ్, స్వచ్చాంద్ర కార్పొరేషన్, ఖనిజాభివృద్ధి సంస్థపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఖాళీల భర్తీ గురించి ఆయన ప్రస్తావించారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీ ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయబోతున్నామని వివరించారు. ఖాళీలను ఏపీపీఎస్సీ క్యాలెండర్ ప్రకారం భర్తీ చేస్తామని తెలిపారు. అలాగే ఎంపీడీవోల పదోన్నతులపై ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ చెప్పినట్టు ప్రభుత్వం 5 రోజులు అదనంగా సెలవు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
ప్రస్తుతం 15 రోజుల సెలవులకు అదనంగా 5 రోజుల సెలవు మంజూరు చేసింది. మహిళా ఉద్యోగులకు వెసులుబాటు కల్పించినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. మహిళా టీచర్లు, లెక్చరర్లకు సెలవులు వర్తిస్తాయని తెలిపింది. ఈ మేరకు జీవో నంబర్ 18ని ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. సీఎం జగన్కు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం, ఏపీ ప్రభుత్వం ఫెడరేషన్ కృతజ్ఞతలు తెలిపింది.