కాపురానికి రావట్లేదని భర్త ఆత్మహత్య: ప్రేమించలేదని యువతిపై పిడిగుద్దులు
ఓ యువతిని ప్రేమించాలంటూ వేధింపులకు గురిచేసిన ఓ యువకుడు.. ఆమె అందుకు నిరాకరించడంతో దాడికి పాల్పడ్డాడు.
అనంతపురం: చిలమత్తూరు మండలం కొడికొండ చెక్పోస్టులో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. తన భార్య కాపురానికి రావట్లేదని భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఎస్సై జమాల్ బాషా తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన హరిజన శంకర్(35) రోజువారీ కూలీగా పనిచేస్తూ భార్య, కూతురిని పోషిస్తున్నాడు.
గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను కాపురానికి ఇంటికి రావాల్సిందిగా శంకర్ పలుమార్లు కోరినా ఆమె రావడానికి నిరాకరించింది. దీంతో మనస్థాపానికి గురైన శంకర్ శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లోని దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ప్రేమించలేదని యువతిని చితక్కొట్టాడు
ఓ యువతిని ప్రేమించాలంటూ వేధింపులకు గురిచేసిన ఓ యువకుడు.. ఆమె అందుకు నిరాకరించడంతో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఘటన స్థలంలోనే ఆమె స్పృహ కోల్పోయింది. ఈ ఘటన గురువారం సాయంత్రం అనంతపురం నగర శివారులోని ఇటుకులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల వద్ద చోటుచేసుకుంది.
పోలీసులు, బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురంలోని శ్రీనివాసనగర్ కు చెందిన యువతి(23) నగర శివారులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. అదే కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని సోదరుడు హరి ప్రతిరోజూ బైక్పై వచ్చి బాధితురాలి వెంటపడేవాడు.
తాను ప్రేమిస్తున్నానని, తనను ప్రేమించాలంటూ వేధింపులకు గురిచేసేవాడు. దీంతో బాధిత యువతి ఓసారి తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారు కళాశాలకు వచ్చి ఆ యువకుడిని హెచ్చరించారు. అయినా పద్ధతి మార్చుకోని యువకుడు.. గురువారం యువతిపై దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.












Click it and Unblock the Notifications