ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ఎమ్మెల్యే కారు బోల్తా
శ్రీకాకుళం: ఓ ప్రైవేటు బస్సు ఢీకొనడంతో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కారు బోల్తా పడింది. ఎమ్మెల్యే రమణమూర్తి వాహనాన్ని గుండువిల్లిపేట సమీపంలో ఓ ప్రైవేటు బస్సు ఢీకొంది. కాగా, ఆ సమయంలో ఎమ్మెల్యే రమణ మూర్తి ఆ కారులో లేరు.
ఆయన ఎంపితోపాటు మరో కారులో ప్రయాణిస్తున్నారు. దీంతో ఆయనకు పెను ముప్పుతప్పింది. ఈ ప్రమాదంలో ఆయన అంగరక్షకుడు, వ్యక్తిగత కార్యదర్శి గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి అందిస్తున్నారు.
కూకట్పల్లిలో పోలీసుల దౌర్జన్యం
హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లిలో పోలీసులు దౌర్జన్యం ప్రదర్శించారు. లంచం ఇవ్వలేదంటూ ఓ ఆటోడ్రైవర్ గోపీని పోలీసులు చితకబాదారు. డిఎస్ఐ క్రాంతికుమార్, కానిస్టేబుళ్లు నర్సింగ్రావు, గోపాల్ తనపై దాడి చేశారంటూ డీసీపీ, హెచ్ఆర్సీకి బాధితుడు ఫిర్యాదు చేశారు.
నివేదిక ఇవ్వాలని కూకట్పల్లి ఏసీపీని హెచ్ఆర్సీ ఆదేశించింది. కూకట్పల్లిలోని రామాలయం దగ్గర ఉన్న ఆటోస్టాండ్ యూనియన్ సభ్యుడైన గోపీతో పాటు మూడు ఆటోలను అక్టోబర్ 14న పోలీసులు స్టేషన్కు తీసుకువెళ్లారు. ఒక్కో ఆటోకు రూ.5 వేల చొప్పున పదిహేను వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే కేసులు పెట్టి ఆటోలను సీజ్ చేస్తామని బెదిరించారు.
దీంతో గోపీ తోటి డ్రైవర్లతో కలిసి నాలుగువేలు జమచేసి డిఎస్ఐకు ఇచ్చేందుకు ప్రయత్నించగా రూ.15 వేలు ఇవ్వాల్సిందే అని కానిస్టేబుళ్లు పట్టుబట్టారు. అంతకు మించి ఇవ్వలేమని గోపీ చెప్పడంతో ఆగ్రహించిన డిఎస్ఐ క్రాంతి కుమార్ అతడి కాళ్లు, చేతులు కట్టేసి చితకబాదాడు. విషయం బయటకు వస్తే తప్పుడు కేసులు బనాయిస్తామని హెచ్చరించారు. ఆస్పత్రిలో చికిత్స చేసుకున్న అనంతరం గోపీ డీసీపీతో పాటు హెచ్చార్సీకి ఫిర్యాదు చేశారు.