రెండో భార్య పుట్టింటికి: మూడో పెళ్లి వద్దన్నందుకు ఆత్మహత్య చేసుకున్నాడు
మొదటి భార్యను విడిచిపెట్టిన యువకుడు.. రెండో భార్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్లడంతో మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు.
చిత్తూరు: మొదటి భార్యను విడిచిపెట్టి, రెండో భార్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్లడంతో మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు ఓ యువకుడు. అయితే, మూడో పెళ్లి చేసుకోవడానికి కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో సదరు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన జిల్లాలోని సోమల మండలంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మదనపల్లె మండలం బసినివడ్డిపల్లెకు చెందిన రెడ్డెప్ప(25)కు అదే గ్రామానికి చెందిన రేఖతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో ఏడాదికే విడాకులు తీసుకున్నారు. అనంతరం రెడ్డెప్ప సోమల మండలం బాలప్పగారిపల్లెకు చెందిన భారతిని వివాహం చేసుకున్నాడు.
కూలీ పనులతో జీవనం సాగిస్తున్న వీరికి మూడు నెలల క్రితం కుమార్తె కలిగింది. భార్య భారతి కాన్పు కోసం పుట్టింటికి వెళ్లడంతో రెడ్డెప్ప మరో అమ్మాయితో ప్రేమాయణం సాగించాడు. ఆ అమ్మాయిని వివాహం చేసుకునేందుకు తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు. సెప్టెంబర్ 20న బాలప్పగారిపల్లెలో ఉన్న భార్య భారతికి విషయం తెలియజేశాడు.
భార్య కూడా మూడో వివాహానికి అడ్డు చెప్పింది. ఈ క్రమంలో మనస్తాపం చెందిన రెడ్డెప్ప పురుగుల మందు తాగాడు. గ్రామస్తులు అతన్ని 108 వాహనంలో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. భార్య భారతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.