వివాహేతర సంబంధం: భర్తను దహనం చేసిన భార్య
వరంగల్: జిల్లాలోని మండలంలోని పోనుగోడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ మహిళ, తన భర్తను సజీవ దహనం చేసింది. ఏప్రిల్ 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై విచారణ జరిపిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం.. పోనుగోడుకు చెందిన భూక్య వీరన్న, నీలమ్మ దంపతులకు ఓ కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఉపాధి కోసం వీరు మూడు సంవత్సరాల క్రితం హైదరాబాద్కు వెళ్లారు. అక్కడే నీలమ్మ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ఈ విషయం తెలుసుకున్న వీరన్న.. ఇటీవల తన కుటుంబంతోపాటు పోనుగోడుకు వచ్చాడు. నీలమ్మ వారం రోజులుగా మళ్లీ హైదరాబాద్కు వెళ్దామని భర్త భూక్య వీరన్నపై ఒత్తిడి చేస్తోంది. దీంతో వీరిద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. తన వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కోపంతో నీలమ్మ, ఏప్రిల్ 26న ఉదయం మద్యం సేవించి వచ్చిన వీరన్న కాళ్లు, చేతులను మంచానికి కట్టేసి అతని మీద బట్టలు వేసి కిరోసిన్ పోసి నిప్పంటించింది.
పెద్ద ఎత్తున మంటలు రావడంతో సమీపంలో ఉన్న గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలు అర్పేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే వీరన్న మృతి చెందాడు. మొదట తనకేమి తెలియదన్న నీలమ్మ, పోలీసుల విచారణలో అసలు విషయం చెప్పింది. తానే తన భర్తను సజీవ దహనం చేసినట్లు వెల్లడించింది.