వివాహేతర సంబంధం: ప్రియుడి ఇంటి ముందు వివాహిత ఆత్మహత్య
అనంతపురం: జిల్లాలోని యాడికి మండలం కమలపాడులో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియుడి ఇంటి ముందే నిప్పంటించుకుని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కాగా, ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తుఫాన్ వాహనం బోల్తా: ఒకరి మృతి, 18 మందికి గాయాలు
ప్రకాశం: ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లి వద్ద కర్నూలు- గుంటూరు రాష్ట్రీయ రహదారిపై శుక్రవారం ఉదయం తుఫాన్ వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా దొనకొండ మండలం గంగదేవపల్లికి చెందిన మేరి(28) అక్కడికక్కడే మృతిచెందగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
మరో 16 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డైవర్తో పాటు 19 మంది గంగదేవపల్లి నుంచి గుణదల మేరీ మాతా ఆలయానికి తుఫాన్ వాహనంలో వెళ్తుండగా... కామేపల్లి వద్దకు రాగానే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోడంతో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది.
సంతమాగులూరు ఎస్సై రాఘవరావు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. డైవ్రర్ పరారీలో ఉన్నాడని ఎస్సై తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.