భర్త శారీరక వేధింపులు.. : కంటతడి పెట్టించేలా..
నెల్లూరు : తాగొచ్చి నరకం చూపించే భర్త.. అదనపు కట్నం కోసే రాచి రంపాన పెట్టే అత్త.. సాంఘీక దురాచారాలను.. భర్తల వ్యసనాలను.. మౌనంగా భరిస్తూ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఎందరో మహిళలు. పోలీస్ స్టేషన్లకు వెళ్లినా వెక్కిరింపులే ఎదురవుతాయి.. చర్యలు తీసుకున్నా కౌన్సెలింగ్ లకే పరిమితమవుతాయి.
ఇదే నేపథ్యంలో దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ మహిళ ఆత్మహత్యే శరణ్యమంటూ స్థానిక కలెక్టర్ కు గోడు వెల్లబోసుకుంది. నెల్లూరు జిల్లా కోనేపల్లికి చెందిన దేవికి 16 ఏళ్ల క్రితం మస్తాన్ బాబు అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టిన భర్త.. తాగొచ్చి శారీరకంగా, మానసికంగా చిత్రవధకు గురిచేయడం మొదలుపెట్టాడు.

మస్తాన్ బాబు ఆగడాలకు తల్లి మద్దతు కూడా తోడయింది. ఇంకేముంది ఇద్దరు కలిసి దేవిని వేధించడమే పనిగా పెట్టుకున్నారు. అంతటితో ఆగకుండా.. అదనపు కట్నం తీసుకురావాలంటూ ఏకంగా ఇంటి నుంచే గెంటేశారు. దీంతో తన ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకుని ఓ చిన్న గదిలో అద్దెకు ఉంటోంది దేవి. అత్త, భర్త వేధింపుల విషయమై సూళ్లూరుపేట పోలీసులకు ఫిర్యాదు చేసినా అక్కడి పోలీసులు ఆమె ఫిర్యాదును లెక్క చేయలేదు.
దీంతో ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో తనకు న్యాయం చేయాలంటూ.. జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించింది దేవి. "పోలీస్ స్టేషన్స్ కు వెళితే కౌన్సెలింగ్ చేసి పంపుతున్నారు తప్పితే, చర్యలేమి తీసుకోవట్లేదు.. ఆ తర్వాత ఇంటికెళితే వేధింపులు మళ్లీ సాధారణమే. నా భర్త, అతని కుటుంబ సభ్యులు నన్ను ఇంటిలోకి రానివ్వడం లేదు. దయచేసి నాకు న్యాయం చేయండి లేకపోతే పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటా..!" అని కలెక్టర్ ను ప్రాధేయపడింది దేవి.












Click it and Unblock the Notifications