బ్లేడుతో ప్రియుడి మర్మాంగం కోసిన మహిళ; ప్రాణాల మీదకు తెచ్చిన వివాహేతర సంబంధం!!
వివాహేతర సంబంధం ఒక వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. పదేళ్లుగా ఒక మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న ఒక వ్యక్తిపై సదరు మహిళ బ్లేడుతో దాడి చేసింది. ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసి పారేసింది. దీంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రకాశం జిల్లాలో దారుణం .. ఆస్పత్రి పాలు చేసిన వివాహేతర సంబంధం
ఇంతకీ ఏం జరిగిందంటే ప్రకాశం జిల్లా కొండెపి మండలం మూగచింతల గ్రామంలో 60 సంవత్సరాల ఓ వ్యక్తి 55 సంవత్సరాల ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. పదేళ్లుగా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఇంతకాలం బాగానే ఉన్నా ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య ఆర్థిక పరమైన అభిప్రాయభేదాలు వచ్చాయి. అంతేకాదు ఇతర విషయాలలో సైతం మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో తనను వేధిస్తున్నాడని భావించిన మహిళ అతనిని అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఆపై ఇంటికి వచ్చిన ప్రియుడిపై బ్లేడుతో దాడి చేసింది.
ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసిన మహిళ
ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసింది. దీంతో బాధతో కేకలు పెట్టిన వ్యక్తి అరుపులు విన్న ఇరుగుపొరుగువారు అక్కడకు వచ్చి జరిగింది తెలుసుకున్నారు. వెంటనే బాధితుడిని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు సదరు మహిళపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొండపి ఎస్ఐ కె రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సదరు మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు కేసును విచారిస్తున్నారు. వివాహేతర సంబంధాల కారణంగా ఇటువంటి ఘటనలు జరగడం ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది.
చాలా నేరాలకు వివాహేతర సంబంధాలే కారణం
వివాహేతర సంబంధాలు నేరపూరిత చర్యలకు కూడా ప్రేరేపిస్తున్న అనేక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవటం, హత్యలు చెయ్యటం వంటి ఘటనలు ముఖ్యంగా వివాహేతర సంబంధాల నేపధ్యంలో చోటు చేసుకుంటున్నాయి. వివాహేతర సంబంధాలు నెరపటమే నేరమైతే, అంతకు మించి నేరాలు, ఘోరాలు కూడా ఇలాంటి సంబంధాలలో చోటు చేసుకుంటున్నాయి. ఇక మానవత్వాన్ని మరిచి క్రూరంగా దాడులకు పాల్పడేలా చేస్తున్నాయి. ఇక ఈ కోవలోనే ప్రకాశం జిల్లాలో ఓ మహిళ తన ప్రియుడి పై బ్లేడుతో దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది.