ఒక వైపు స్టీల్ ప్లాంట్ ఉద్యమం : ఏపీలో మూడు విమానాశ్రయాలు ప్రైవేటు పరం : ఇక, మిగిలేవి ఇవే..!!
ఏపీలో కేంద్ర నిర్వహణలో ఉన్న సంస్థల పైన వరుస నిర్ణయాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే కేంద్రం ప్రయివేటకరణ నిర్ణయాల పైన పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీలో ఎంతో చరిత్ర ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ లో కేంద్రం తమ పెట్టుబడులను ఉప సంహరించుకుంటూ..ప్రయివేటీకరణ దిశగా నిర్ణయం తీసుకుంది. దీని పైన స్టీల్ ప్లాంట్ కార్మికులతో సహా.. రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక, ఇప్పుడు ఏపీలోని మూడు విమానాశ్రయాల ప్రవేటీకరించటానికి నిర్ణయం తీసుకుంది. నష్టాలను సాకుగా చూపిస్తూ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రణాళికలు సిద్దం చేసింది.

మూడు విమానశ్రయాలపై నిర్ణయం
విజయవాడ, తిరుపతి, రాజమండ్రిల అప్పగింతకు రంగం సిద్ధం అవుతోంది. 2025లోగా తొలి దశలో చేతులు మారనున్న 25 ఎయిర్పోర్టుల జాబితాలో ఏకంగా ఏపీకి చెందిన మూడు విమానాశ్రయాలు ఉన్నాయి. ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా 136 ఎయిర్పోర్టులను కలిగి ఉంది. కాగా, ఆంధ్రప్రదేశ్లో ఆరు ఉన్నాయి. ఇందులో ఒక్క దొనకొండ తప్ప మిగతా రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కడప నుంచి ప్రతి రోజు సర్వీసులు నడుస్తున్నాయి.
ఈ విమానాశ్రయాల నష్టం ప్రతి ఏటా భారీగా పెరుగుతుండటంతో వీటిని నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ (ఎన్ఎంపీ) కింద దశల వారీగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ (పీపీపీ) విధానంలో ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టనున్నట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

విశాఖ మినహా మిగిలినవి నష్టాల్లోనే
రాష్ట్రంలో గడిచిన మూడేళ్లలో ఒక్క విశాఖ విమానాశ్రయం తప్ప మిగిలిన విమానాశ్రయాలు ఒక్కసారి కూడా లాభాలు నమోదు చేయలేదని ఏఏఐ తాజాగా విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018-19లో మొత్తం ఆరు విమానాశ్రయాల నష్టం రూ.130.24 కోట్లు ఉండగా, అది 2020-21 నాటికి రూ.191.5 కోట్లకు చేరింది. 2019-20లో విశాఖ విమానాశ్రయం రూ.2.29 కోట్ల లాభాలను నమోదు చేయగా, కోవిడ్ దెబ్బతో 2020-21 నాటికి రూ.29.37 కోట్ల నష్టాలను ప్రకటించింది.
దొనకొండ ఎయిర్స్ట్రిప్ట్ నిర్వహణలో లేకపోయినప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది కోసం ఏటా కొన్ని లక్షలు వ్యయం చేయాల్సి వస్తోందని కేంద్రం లెక్కలు చెబుతోంది. విమానాశ్రయాలను 50 ఏళ్ల నిర్వహణకు వీలుగా మొత్తం 25 ఏయిర్ పోర్టులను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడానికి టెండర్లు పిలవనుంది.

వచ్చే మూడేళ్ల కాలంలో మూడు ఏయిర్ పోర్టులు
అందు కోసం 2022 నుంచి 2025 సమయంగా నిర్ణయించారు. వాటిల్లో ఏపీలోని రాజమండ్రి, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలు ఉన్నాయి. ఇందులో విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలకు అంతర్జాతీయ విమానాశ్రయ హోదా ఉంది. దీని ద్వారా మరింతగా డిమాండ్ వస్తుందని అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం విమానాశ్రయాన్ని కొత్తగా భోగాపురంలో నిర్మించడానికి ఇప్పటికే జీఎంఆర్కు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.
రాష్ట్రంలో ఏఏఐ ఆధ్వర్యంలో నడిచే విమానాశ్రయం కడప ఒక్కటే మిగిలి వుండగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే విమానాశ్రయంగా కర్నూలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం మిగలనుంది. అయితే, వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో విధి విధానాలు ఖరారు చేయాల్సి ఉంది.
Recommended Video

స్టీల్ ప్లాంట్ ఉద్యమం కొనసాగుతున్న వేళ
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రయివేటు పరం చేయాలనే ఆలోచనలో ఉన్న రాజమండ్రి, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలకు రాష్ట్ర ప్రభుత్వం భూమి సమీకరించి ఇచ్చింది. ఇక, ఇప్పుడు ప్రయివేటు సంస్థలకు వీటిని అప్పగిస్తే ఏపీకి ఇవ్వాల్సిన వాటా ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే, ఇది జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న విధానపరమైన నిర్ణయం కావటంతో..ఏపీలోనూ విమానాశ్రయాల లాభ నష్టాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఈ నిర్ణయం పైన ప్రజా సంఘాలు..రాజకీయ పార్టీల స్పందన ఏంటనేది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications