'లోకసభ' సీన్ రివర్స్, చంద్రబాబుకు భారీ దెబ్బ: ఏపీలో జగన్ పార్టీకి 21, టీడీపీకి 4 సీట్లే!
Recommended Video
హైదరాబాద్/అమరావతి/న్యూఢిల్లీ: ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఏ పార్టీకి మెజార్టీ వస్తుంది, ఎవరు ప్రధాని అవుతారని తెలుసుకునేందుకు ఏబీపీ - సీ ఓటరు సంయుక్తంగా దేశ్ గా మూడ్ పేరుతో సర్వే చేసింది. ఈ సర్వేలో బీజేపీకి సీట్లు తగ్గినా నరేంద్ర మోడీ మళ్లీ ప్రధానమంత్రి అవుతాడని వెల్లడైంది.
ప్రధానమంత్రిగా కూడా ఎక్కువ మంది మోడీనే కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీ సహా ఎవరూ ఆయనకు అందనంత దూరంలో ఉన్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోను ఏబీపీ - సీ ఓటరు సర్వే చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితిలు ఎక్కువ సీట్లు పొందనున్నాయని తేలింది.
21 చోట్ల వైయస్సార్ కాంగ్రెస్, టీడీపీ 4 చోట్ల
ఏబీపీ - సీ ఓటరు సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కనిపించనుంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఈ పార్టీ ఏకంగా 21 లోకసభ స్థానాల్లో విజయం సాధించనుందని తేలింది. గత ఎన్నికల్లో వైసీపీ తక్కువ స్థానాల్లో గెలవగా, టీడీపీ ఎక్కువ స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. కానీ ఈసారి ఏపీలోని 25 అసెంబ్లీ స్థానాలకు గాను జగన్ పార్టీయే ఏకంగా 21 స్థానాలు గెలుచుకుంటుందని తేలింది. తెలుగుదేశం పార్టీ కేవలం 4 సీట్లకే పరిమితం అవుతుందట.
రంగంలోకి పవన్ కళ్యాణ్, మార్పులు
ఏపీబీ - సీ ఓటరు సర్వేలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ప్రభావం లేదని తేలింది. గత ఎన్నికల్లో కంటే కాంగ్రెస్ పుంజుకున్నప్పటికీ, అలాగే బీజేపీ గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలిచినప్పటికీ ఈసారి ఈ పార్టీలు సీట్లు గెలుచుకునే అవకాశాలు కనిపించడం లేదని సర్వేలో తేలింది. ఇక జనసేన పూర్తిగా రంగంలోకి దిగలేదు. ఈ నేపథ్యంలో జరిగిన సర్వే ఫలితాలు ఇలా ఉండగా, పవన్ కళ్యాణ్ దూసుకెళ్తున్నందున అప్పటికి మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణలో తెరాసదే హవా
ఇక తెలంగాణ విషయానికి వస్తే ఎన్డీయే కూటమికి 17 స్థానాలకు గాను 15 స్థానాలు వస్తాయని ఏబీపీ - సీ ఓటరు సర్వేలో వెల్లడైంది. అయితే తెలంగాణ రాష్ట్ర సమితిని ఎన్డీయే భాగస్వామిగా పేర్కొన్నట్లుగా ఉంది. అందుకే ఎన్డీయే కూటమికి 15 సీట్లు వస్తాయని పేర్కొన్నారు. తెరాస మాత్రం తమకు బీజేపీతో సంబంధం లేదని తేల్చి చెబుతోంది. ఏదేమైనా ఈ లెక్కన తెరాసకు 14, బీజేపీకి 1 సీటు వచ్చే అవకాశముంది. యూపీఏ 1 సీట్లు, ఇతరులు (మజ్లిస్) ఒక సీటు గెలుచుకుంటుందని సర్వేలో వెల్లడైంది.
దక్షిణాదిన ఇదీ లెక్క
దక్షిణ భారత దేశంలోని కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 129 స్థానాలు ఉండగా, ఎన్డీయే 21, యూపీఏ 32, ఇతరులు 76 స్థానాలు గెలుచుకుంటారని ఏబీపీ - సీ ఓటరు సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రధాని కావాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది.