2009 ఎఫెక్ట్: గాయత్రిపై నిఘాతో గుట్టు రట్టు, అతను సొంత ప్లాట్లో ఉండకుండా
టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ రఘురామి రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తొలుత నిఘా పెట్టింది. కానీ ఫలితం లేకుండాపోయిందని తెలుస్తోంది. అనంతరం బినామీలపై నిఘా పెట్టడంతో దొరికిపోయారు.
అమరావతి: టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ రఘురామి రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తొలుత నిఘా పెట్టింది. కానీ ఫలితం లేకుండాపోయిందని తెలుస్తోంది. అనంతరం బినామీలపై నిఘా పెట్టడంతో దొరికిపోయారు.
చదవండి: రూ.500 కోట్ల ఆస్తులు: బయట తాళం వేసి ఇంట్లో, గాయత్రిని పట్టించిన ఏసీ
ఏసీబీ అధికారులు తొలుత రఘు, ఆయన బంధువులపై నిఘా ఉంచారు. కానీ ఎక్కడ కూడా అక్రమాలకు సంబంధించి వారికి ఆధారాలు దొరకలేదు. 2009లో ఓసారి ఏసీబీ అధికారులు రఘు ఇంట్లో తనిఖీ చేసారు. అప్పటి నుంచి జాగ్రత్త పడుతున్నారు.
బినామీలపై నిఘా పెట్టారు
దీంతో ఏసీబీ అధికారులు ఆయన ఎవరెవరితో ఎక్కువగా మాట్లాడుతున్నారనే విషయాన్ని గమనించారు. తన బినామీలు వెంకటశివప్రసాద్, గాయత్రిలతో మాట్లాడుతున్నట్లు గుర్తించారు. దీంతో వారిపై అధికారులు నిఘా పెట్టారు. అప్పుడు రఘు అక్రమాల సొమ్ము ఏమవుతుందో గుర్తించారు.
భార్య పేరిట కొని, గాయత్రి ఇంట్లో దాచి
రఘు ఆభరణాలను భార్య పేరిట కొనుగోలు చేసేవారు. అవసరమైనపుడు మాత్రమే ఆయన భార్య, కుమార్తె వాటిని ధరించేవారు. అనంతరం వాటిని గాయత్రి ఇంట్లో పెట్టేవారు. కానీ ఆ తర్వాత తన భార్య పేరిట కొనడం మానేశారు. రఘు ఇంట్లో స్వాధీనం చేసుకున్న ఫొటోలను, గాయత్రి ఇంట్లో లభ్యమైన ఆభరణాలను పరిశీలించగా ఆ విషయం తేలింది.
తవ్వేకొద్దీ అక్రమార్జన.. కస్టడీకి
తవ్వే కొద్దీ అక్రమార్జన వెలుగుచూస్తుండటం, వివిధ సంస్థల పేరిట ఆస్తులు కొనుగోలు చేయడం, కొత్త కొత్త బినామీలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో రఘు, వెంకట శివప్రసాద్, గాయత్రిల నుంచి అక్రమాలకు సంబంధించిన మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు.
పరారీలో రఘు సన్నిహిత వ్యక్తి
విశాఖలో రఘుకు అత్యంత సన్నిహితంగా మెలిగిన లైసెన్స్డ్ సర్వేయర్ గోవిందరాజులు ఇల్లు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీ చేసి కంప్యూటర్లలోని హార్డ్ డిస్క్లను తీసుకెళ్లారు. వాటిని పరిశీలించనున్నారు. తొలుత తన భార్య పేరిట ఆస్తులు కొన్ని రఘు.. ఆ తర్వాత గాయత్రి, ఆమె డైరెక్టర్గా ఉన్న సంస్థల పేరిట కొంటున్నారు.
సొంత ఫ్లాట్లో ఉండకుండా అద్దె ఇంట్లో ఎందుకు?
రఘుపై దాడులు చేసిన నాటి నుంచి లైసెన్స్డ్ సర్వేయర్ గోవిందరాజులు పరారీలో ఉన్నారు. ఆశీలుమెట్టలో ఆయనకు 902 నెంబరు ఫ్లాట్ ఉంది. ఆయన అందులో ఉండకుండా పక్కనే ఉన్న 901 ఫ్లాట్లో ఉంటున్నారు. సొంత ఫ్లాట్ను అద్దెకిచ్చి మరో ఫ్లాట్లో ఎందుకు అద్దెకుంటున్నారు? అసలు అద్దెకు తీసుకున్న విషయం వాస్తవమేనా? అన్న అంశాలపై కూడా ఆరా తీస్తున్నారు.