అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఏపీ, తెలంగాణకు చెందిన ముగ్గురు మృతి
అమరావతి: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువకులు, ఓ యువతి ప్రాణాలు కోల్పోయారు. కనెక్టికట్ రాష్ట్రంలో మినీ వ్యాను, ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద ఘటనలో మినీ వ్యానులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందిలో ముగ్గురు మృతి చెందగా, నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మరొకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామానికి చెందిన నర్సరీ రైతు పాటంశెట్టి శ్రీనివాస్ కుమారుడు పాటంశెట్టి సాయి నరసింహ(23) అమెరికాలో కనెక్టికట్ రాష్ట్రంలో ఎంఎస్ అభ్యసిస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం ఏడు గంటల సమయంలో ఏడుగురు స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తున్నాడు.
అయితే, పొగమంచు కారణంగా వీరు ప్రయాణిస్తున్న కారు.. ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయి నరసింహతోపాటు తెలంగాణలోని వరంగల్కు చెందిన పావని, హైదరాబాద్ కు చెందిన మరో యువకుడు ప్రేమ్ కుమార్ రెడ్డి మృతి చెందారు. కారులోని మిగిలిన ఐదుగురు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సాయి నరసింహ కుటుంబసభ్యులకు సమాచారం అందింది. దీంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సాయి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సాయి కుటుంబంతోపాటు స్థానికంగా విషాదం నెలకొంది.
నరసింహ చెన్నైలోని ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు. క్యాంపస్ ఇంటర్వ్యూ ద్వారా ఓ కంపెనీలో కొలువు సాధించాడు. ఆ తర్వాత ఎంఎస్ చేయాలని భావించి.. ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాడు. ఈ ఏడాది ఆగస్టు 5న అమెరికాకు వెళ్లాడు. ఇటీవల అక్కడ జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొని తల్లిదండ్రులకు వీడయో కాల్ కూడా చేశాడు.
అంతలోనే తమ కుమారుడు మరణించాడనే వార్త వినడంతో తల్లిదండ్రులు శ్రీనివాస్, సుశీల కన్నీటిపర్యంతమవుతున్నారు. మృతుడి సోదరి పాటంశెట్టి నందిని చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. ఇదే గ్రామానికి చెందిన సిద్దిరెడ్డి ఐశ్వర్య కూడా సాయి ప్రయాణిస్తున్న కారులోనే ఉన్నప్పటికీ.. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమె ఆస్పత్రితో చికిత్స తీసుకుంటోంది. మరోవైపు, ప్రేమ్ కుమార్ రెడ్డి, పావని కుటుంబ సభ్యులు కూడా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.