రైలు ప్రమాదం: చికిత్స పొందుతూ మరో చిన్నారి మృతి
హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట రైలు ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తరుణ్(7) అనే చిన్నారి సోమవారం మృతి చెందాడు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని గుండారెడ్డిపల్లికి చెందిన విద్యార్థి తరుణ్ మృతితో అతని కుటుంబంతోపాటు ఆ గ్రామంలో విషాదం అలుముకుంది.
పోస్టుమార్టం నిమిత్తం తరుణ్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద స్కూల్ బస్సును రైలు ఢీకొన్న ప్రమాదంలో 14 మంది విద్యార్థులతో సహా బస్సు డ్రైవర్, క్లీనర్ దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో కోలుకున్న మరో ఏడుగురు విద్యార్థులను సోమవారం డిశ్చార్జ్ చేశారు.
మరో ఏడుగురిని కూడా రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. మరో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి ఆందోళనక కరంగా ఉందని చెప్పారు. ముగ్గురు విద్యార్థులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
ఇది ఇలా ఉండగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన కీసరలో మద్యం మత్తులో పాఠశాల బస్సు నడిపిన ఓ డ్రైవరు రోడ్డుపై వెళుతున్న ఓ కారు, ట్రాక్టర్ను ఢీకొట్టాడు. దీంతో బస్సులోని పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆగ్రహించిన స్థానికులు ప్రమాదానికి కారణమైన ఆ డ్రైవరును చితకబాదారు. గాయాలపాలైన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.