అమరావతి పాదయాత్రకు అసలు పరీక్ష-గోదావరితో మొదలై ఉత్తరాంధ్రలో పీక్-టర్నింగ్ పాయింట్
ఏపీలో అమరావతిలోనే రాజధాని కోరుతూ రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్ని దాటి గోదావరి జిల్లాల్లోకి ప్రవేశించింది. ఇప్పటివరకూ ఈ రెండు జిల్లాల్లో పాదయాత్ర సజావుగానే సాగిపోయినా గోదావరి జిల్లాలతో అసలు పరీక్ష ప్రారంభం కానుంది. ఇక్కడ మొదలయ్యే ఈ పరీక్ష ఉత్తరాంధ్రకు వెళ్లి సరికి మరింత తీవ్రం కానుంది. దీంతో ఈ పరీక్షలో రైతులు పాసైతే సరే సరి లేదంటే ఆ ప్రభావం వచ్చే ఎన్నికలపై పడటం ఖాయంగా కనిపిస్తోంది.

అమరావతి పాదయాత్ర
అమరావతి రాజధాని కోరుతూ రైతులు చేస్తున్న పాదయాత్ర విజయవంతంగానే కొనసాగుతోంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాల్లో రైతుల పాదయాత్రకు పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. కానీ కృష్ణాజిల్లాకు వచ్చేసరికి మాజీ మంత్రి కొడాలినాని ఎమ్మెల్యేగా ఉన్న గుడివాడలో పాదయాత్ర కొంత ఉద్రిక్తతలకు కారణమైంది. అమరావతి ఉద్యమాన్ని చులకన చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్న కొడాలి నాని అడ్డాలో రైతులు తమ సత్తా చాటుకోవాలని నిర్ణయించుకోవడమే ఇందుకు కారణం. అనుకున్నట్లుగా మహిళా రైతులు తొడలు కొట్టి మరీ గుడివాడలో నానిపై సవాళ్లు విసిరారు. అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా రాబోయే రోజుల్లో రైతుల యాత్ర ఇంత సజావుగా సాగే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.

గోదావరిజిల్లాల నుంచి అగ్నిపరీక్ష
కమ్మ సామాజిక వర్గ ప్రభావం కనిపించే ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అమరావతి రైతుల పాదయాత్రకు ఊహించినట్లుగానే మంచి మద్దతే లభించింది. అయితే ఇప్పుడు గోదావరి జిల్లాల్లోకి యాత్ర ప్రవేశించింది. దీంతో గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్దితులు రైతులకు ఏమాత్రం సహకరిస్తాయో తెలియదు. ఓవైపు గోదావరి జిల్లాలకు చెందిన మంత్రులు కూడా పాదయాత్రపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలే గోదావరి జిలాల్లో ఈసారి తమకు విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తున్న టీడీపీ-జనసేన నేతలు ఈ యాత్రను విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తారు. అదే సమయంలో వైసీపీ నేతలు విమర్శలు ఎక్కుపెట్టడం ఖాయం. స్ధానికంగా యాత్ర సందర్భంగా ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా తప్పకపోవచ్చు. దీంతో యాత్రకు అసలు పరీక్ష మొదలైనట్లే.

ఉత్తరాంధ్రను రెచ్చగొడుతున్న మంత్రులు
వచ్చేనెలలో అమరావతి పాదయాత్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి ప్రవేశిస్తుంది. అప్పటికల్లా ఇక్కడి వాతావారణాన్ని పూర్తిగా పాదయాత్రకు వ్యతిరేకంగా మార్చడానికి వైసీపీ మంత్రులు,ఎమ్మెల్యేలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా మంత్రులు బొత్స, దాడిశెట్టి రాజా, వైసీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ చేసిన వ్యాఖ్యల్ని గమనిస్తే ఈ విషయం ఇట్టే అర్ధమవుతుంది. ఈ యాత్రకు అండగా నిలుస్తున్న టీడీపీ నేతలపైనా దాడులు తప్పవనే హెచ్చరికలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందో తెలుస్తోంది. అధికారంలో ఉన్న వారే హెచ్చరికలకు దిగితే క్షేత్రస్దాయిలో పరిస్ధితులు ఎలా ఉంటాయో సులువుగా అర్ధం చేసుకోవచ్చు.

2024 టర్నింగ్ పాయింట్ ?
అలాగే అమరావతి పాదయాత్రపై వైసీపీ వర్సెస్ విపక్షాలుగా రాజకీయ పార్టీలు విడిపోతున్న తీరు చూస్తుంటే రాబోయే ఎన్నికలకు ఈ యాత్ర ఎంత కీలకంగా మారిపోతోందో ఇట్టే అర్ధమవుతుంది. ఈ యాత్రను విజయవంతం చేసుకోగలిగితే తమ విజయావకాశాలు మెరుగుపడతాయని టీడీపీ, జనసేన, బీజేపీ భావిస్తుంటే.. దీన్ని అడ్డుకోవడం ద్వారా విపక్షాల దూకుడుకు అడ్డుకట్ట వేయాలని వైసీపీ భావిస్తోంది. దీంతో ఇరువురికీ ఇదో ప్రతిష్టాత్మక వ్యవహారంగా మారిపోతోంది. గోదావరి జిల్లాల్లో పరిస్ధితులు కాస్త అటు ఇటుగా ఉన్నా ఉత్తరాంధ్రకు వచ్చేసరికి వేడి రగిలించేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఈ యాత్ర కచ్చితంగా రాజకీయ సమీకరణాల్ని మార్చడం ఖాయంగా కనిపిస్తోంది. తద్వారా 2024 ఎన్నికలకు ఇదో టర్నింగ్ పాయింట్ గా అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.












Click it and Unblock the Notifications