జయ ఆరోగ్యం: గవర్నర్ హర్షం, చంద్రబాబు తరఫున అపోలోకు సుజన
చెన్నై/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరపున తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను పరామర్శించేందుకు కేంద్రమంత్రి సుజనా చౌదరి శనివారం నాడు అపోలో ఆసుపత్రికి వచ్చారు.
టిడిపి ఎంపీలు మురళీ మోహన్, సీఎం రమేష్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. జయలలిత ఆరోగ్యం గురించి ప్రతాప్ సి రెడ్డి, లోకసభ ఉపసభాపతి తంబిదురై వివరించారని, ఆమె ఆరోగ్యం 95 శాతం మెరుగుపడినట్లు చెప్పారని సుజనా చౌదరి తెలిపారు.
జయలలితను గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా శనివారం నాడు పరామర్శించారు. చికిత్సకు జయ చాలా బాగా స్పందిస్తున్నారని, వైద్యులతో మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
జయ చికిత్స పొందుతున్న వార్డుకు వెళ్లి ఆమెను గవర్నర్ చూశారని, ఆమె ఆరోగ్యం మరింత మెరుగుపడినందుకు హర్షం వ్యక్తం చేశారని రాజ్భవన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి గవర్నర్కు 'అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి వివరించారని తెలిపింది. హృద్రోగ, శ్వాసకోశ, మధుమేహ వైద్యనిపుణులు, ఇతర నిపుణులు అందిస్తున్న సేవల గురించి కూడా తెలియజేశారని చెప్పింది.
ముఖ్యమంత్రికి అత్యుత్తమ వైద్యసేవలు అందిస్తున్నందుకు వైద్య బృందానికి గవర్నర్ విద్యాసాగర రావు కృతజ్ఞతలు తెలిపారు. జయలలిత ఆరోగ్యం గురించి పలు రకాల వదంతులు ప్రచారమైనప్పుడు ఈ నెల 1న తొలిసారి ఆమెను విద్యాసాగర్ రావు పరామర్శించారు.












Click it and Unblock the Notifications