రాజకీయాల్లో ఎంట్రీపై తేల్చేసిన మంచు మనోజ్: చంద్రబాబుతో భేటీ- బ్లెస్సింగ్స్
హైదరాబాద్/అమరావతి: ప్రముఖ నటుడు మోహన్ బాబు రెండో కుమారుడు, హీరో మంచు మనోజ్.. రాజకీయ అరంగేట్రానికి ముహూర్తం ఖరారైనట్టే కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో చేరడానికి మంచు మనోజ్ సన్నాహాలు చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా ఆయన తొలి అడుగు వేసినట్టే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడితో భేటీ కావడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.
మంచు మనోజ్, ఆయన భార్య భూమా మౌనికా రెడ్డి ఈ సాయంత్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో చంద్రబాబుతో సమావేశం అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు వారిమధ్య ప్రస్తావనకు వచ్చాయి. రాజకీయాలతో పాటు కుటుంబపరమైన విషయాలపైనా వారు చర్చించారు.

ఈ భేటీ ముగిసిన అనంతరం మంచు మనోజ్.. విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యతా లేదని అన్నారు. మర్యాదపూరకంగా మాత్రమే చంద్రబాబును కలిశానని చెప్పారు. మౌనికా రెడ్డిని వివాహం చేసుకున్న తరువాత ఇప్పటివరకు చంద్రబాబును కలవలేదని, ఆయనను కలిసి ఆశీర్వాదాన్ని తీసుకోవాలని చాలా సందర్భాల్లో అనుకున్నప్పటికీ.. కుదరలేదని అన్నారు.
ఇవ్వాళ చంద్రబాబుకు ఫోన్ చేయగా.. అపాయింట్మెంట్ ఇచ్చారని మంచు మనోజ్ వివరించారు. ఆగస్టు 1వ తేదీన కుమారుడు ధీరవ్ పుట్టినరోజు కూడా కావడం వల్ల కుటుంబంతో కలిసి చంద్రబాబు ఆశీర్వాదాన్ని తీసుకున్నానని అన్నారు. చంద్రబాబును కలుసుకోవడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారాయన.
రాజకీయాల్లో ప్రవేశిస్తారంటూ వచ్చిన ప్రచారంపైనా మంచు మనోజ్ స్పందించారు. ఆ వార్తలను కొట్టిపారేయలేదు. రాజకీయాల్లో అడుగుపెట్టే సందర్భం వచ్చినప్పుడు చెబుతానని పేర్కొన్నారు. ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత లేదని భూమా మౌనికారెడ్డి కూడా స్పష్టం చేశారు. పెళ్లయిన తరువాత తొలిసారిగా చంద్రబాబును కలుసుకోవడానికే వచ్చామని అన్నారు.
మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్న భూమా మౌనికా రెడ్డి కుటుంబం- తెలుగుదేశం పార్టీలో కొనసాగుతోంది. భూమా అఖిలప్రియ.. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. 2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, వైఎస్ఆర్సీపీ చేతిలో ఓటమి చవి చూశారు. ఆ తరువాత కూడా ఆమె క్రియాశీలకంగా ఉంటోన్నారు.
అఖిలప్రియ చెల్లెలు మౌనికా రెడ్డిని రెండో వివాహం చేసుకున్న మంచు మనోజ్.. టీడీపీ వైపు మొగ్గు చూపినట్టే. అదే జరిగితే- మంచు మనోజ్ను ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దింపే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఇప్పటికే భూమా అఖిలపై నియోజకవర్గంలో అసంతృప్తి వ్యక్తమౌతోండటం, టీడీపీకే చెందిన సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డితో భూమా అఖిలప్రియకు తీవ్ర స్థాయిలో విభేదాలు ఉండటం వల్ల ఆమెకు బదులుగా మంచు మనోజ్ను పోటీకి దింపొచ్చనే అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications